04-09-2025 01:13:24 AM
-అవినీతి సొమ్ములో వాటాల తేడాతోనే పంచాయతీ
-పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్
-హరీశ్ వెనక సీఎం ఉంటే సీబీఐకి ఎందుకిస్తారు?
-మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : కవిత కేసీఆర్ విడిచిన బాణం అని సందేహం కలుగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకు కేసిఆర్ కుటుంబం కొత్త నాటకం ఆడుతోందని విమర్శించారు. బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ కవిత కొన్ని కఠోర సత్యాలు చెప్పినప్పటికి, కొన్ని అబద్ధాలు మాట్లాడారన్నారు.
కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం శుభ పరిణామంగా భావిస్తామన్నారు. అయితే కవిత రాజీనామా ఐదేళ్ల ముందు చేసుంటే ప్రజలు అంగీకరించేవారని తెలిపారు. కేసీఆర్ అనుమతి లేకుండా అవినీతి జరిగిందా..? అని మహేష్కుమార్గౌడ్ నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలలో జరిగిన అవినీతిలో కవిత కూడా భాగస్వామ్యం అయ్యారని ఆయన ఆరోపించారు. అవినీతి సంపాదనలో జరిగిన వాటాల పంపకాల్లో తేడాల వల్లనే కవిత పంచాయతీ నడుస్తోందన్నారు.
హరీశ్రావు, సంతోష్ రావు వెనక ఉండాల్సిన ఖర్మ మాకేంటి..? మేము ప్రజల వెంట ఉన్నాం. దోచుకొని దాచుకొని ఇప్పుడు కవిత నీతి వ్యాఖ్యలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మహేష్కుమార్గౌడ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై కవిత అభాండాలు వేయడం సబబు కాదని ఆయన హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో నాటికి బీఆర్ఎస్ పార్టీ ఉండదని ఆయన జోస్యం చెప్పారు. కవిత అమెరికా వెళ్లి రాగానే స్టాండ్ ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. మొదట కేటీఆర్ పై ఎక్కు పెట్టిన బాణం ఇప్పుడు హరీశ్రావు పైకి ఎందుకు మళ్ళిందో చెప్పాలన్నారు.
అది వారి కుటుంబ తగాదా: మంత్రి అడ్లూరి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం అవినీతి బయట పడ్డాక.. వాళ్లలో వారికి పంచాయతీ మొదలైందని, అది కుటుంబ తగాదా అని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత బీఆర్ఎస్ పై అనేకసార్లు, అనేక రకాలుగా దాడి చేసిందన్నారు. హరీశ్రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉంటే కాళేశ్వరం పై విచారణ ఎందుకు చేయిస్తారని మంత్రి ప్రశ్నించారు. హరీశ్రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనేది తప్పుడు ప్రచారం, గ్లోబల్ ప్రచారం మాత్రమేనని అన్నారు. కవితను లిక్కర్ స్కామ్లో అరెస్టు అయినప్పుడే పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయాల్సి ఉండేదన్నారు. లక్ష కోట్లు దోచుకున్నాక మాట్లాడడం ఏంటి.? కల్పకుంట్ల కుటుంబంలో ఆరు నెలల నుంచి అంతర్గతంగా పంచాయతీ జరుగుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మీ కుటుంబం దొంగతనం చేసిందని కవిత ఒప్పుకున్నదని మంత్రి పేర్కొన్నారు. కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు, సంతోష్ రావు బాధ్యులని కవిత చెప్పిందని, వాళ్లు మీ కుటుంబ సభ్యులే కదా..? అని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలలో రాష్ర్ట ఖజానాలో రూ. వేల కోట్లు ఖూనీ చేశారని తెలిపారు.