బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్ అప్రజాస్వామికమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే ఆయన పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టి ఏదీ అసలు, ఏదీ నకిలీదో తేల్చాలని సవాల్ విసిరారు. ఆ తరువాత ఎవరు చంచల్గూడ జైల్లో కూర్చోవాలో తేలుతుందన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వెంటనే క్రిశాంక్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం చంచల్గూడ జైల్లో క్రిశాంక్తో ములాఖత్ అయ్యారు. చేయని తప్పుకు జైల్లో వేశారని, ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి రేవంత్రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.