07-07-2025 12:00:00 AM
పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ
హైదరాబాద్, జులై 6 (విజయక్రాంతి): ఏపీ మంత్రి నారా లోకేశ్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ రహస్య మంతనాలు జరుపుతున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల పక్క రాష్ర్టంలో అధికారంలో ఉన్న నేతలను కేటీఆర్ కలిశారని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణాలో తెలంగాణ వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుంటే..
బనకచర్ల ప్రాజెక్టు ఆపేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. కేటీఆర్ మాత్రం లోకేశ్ తో సీక్రెట్ మీటింగ్స్ జరిపారని విమర్శించారు. కేటీఆర్ను లోకేశ్ రెండు సార్లు కలిశారని తెలిపారు. ఆ రహస్య మంతనాలు ఎవరికి లబ్ధి చేయడానికో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేటీఆర్ స్పందించకుంటే వివరాలన్నీ బయటపెడతానని ఆయన చెప్పారు.
తెర వెనక తెలంగాణపై కుట్రలు చేస్తుంది ఎవరనేది వీరి భేటీతో అర్థం అవుతుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి విసిరిన సవాల్కు కేటీఆర్ ప్రతి సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు. అన్ని అంశాలపై సోమవారం అమరవీరుల స్థూపం వద్దకు వస్తే చర్చిద్దామని సవాల్ విసిరారు. రైతుల సంక్షేమం మీద మాట్లాడేందుకు సిగ్గు ఉండాలని, పదేళ్లలో రైతులు చనిపోతే కనీసం పట్టిం చుకోలేదని ఆయన మండిపడ్డారు.