28-06-2025 01:19:32 AM
పౌరులకు న్యూక్లియర్ విద్యుత్ అందించేందుకే..
అమెరికాతో చర్చలకు ఇరాన్ నో
చర్చలకు ఖతార్ మధ్యవర్తిత్వం
వాషింగ్టన్, జూన్ 27: ఇరాన్ పౌరుల అవసరాల కోసం న్యూక్లియర్ విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు 30 బిలియన్ డాలర్ల (రూ. 2.5 లక్షల కోట్లు) సాయాన్ని ఆ దేశానికి అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్టు సీఎన్ఎన్ తెలిపింది. అయితే ఈ సాయంలో కొంత మొత్తం అరబ్ దేశాలు కూడా భరించాలని భావిస్తున్నట్టు ట్రంప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
ఇరాన్ యురేనియం నిల్వలను అణుబాంబులు తయారు చేసేందుకు కాకుండా విద్యుత్ కోసమే వినియోగించాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్ యురేనియాన్ని శుద్ధి చేయకూడదనే తమ విధానంలో అస్సలుకే రాజీపడకూడదని అగ్రరాజ్యం భావిస్తోంది. ఇరాన్లోని మూడు అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా దాడుల అనంతరం అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, గల్ఫ్ దేశాల ప్రతినిధుల మధ్య వైట్ హౌస్లో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన అనంతరం కూడా ఈ విషయంలో చర్చలు జరిగినట్టు సమాచారం. గతంలో ఇరాన్ అమెరికా మధ్య జరిగిన అణుచర్చల్లో కూడా పౌర అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటు విషయం ప్రతిపాదనకు వచ్చింది. అంతే కాకుండా తమపై విధించిన కొన్ని ఆంక్షలను ఎత్తివేసి.. వివిధ బ్యాంకులలో అమెరికా స్తంభింపజేసిన 6 బిలియన్ డాలర్లను వినియోగించుకునేలా చేయాలనే ప్రతిపాదన కూడా ఇరాన్ తీసుకొచ్చింది.
ప్రస్తుత చర్చల కోసం ఇరాన్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. అమెరికాతో అణుచర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ వెల్లడించారు. అమెరికా దాడుల వల్ల తమ దేశంలోని అణుకేంద్రాలకు తీవ్రనష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ చర్చల కోసం ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలినా లీవిట్ తెలిపారు. ఇటీవల జరిగిన నాటో సమావేశంలో కూడా ట్రంప్ టెహ్రాన్తో చర్చలు జరుపుతామని పేర్కొన్నారు.