కామారెడ్డి జిల్లాలో లేగ దూడపై చిరుత దాడి
చిరుతల సంచారం, ఆందోళనలో గ్రామాలు, తండాల ప్రజలు..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో చిరుతపులుల సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి, లింగంపేట్, గాంధారి మండలాల అటవీ ప్రాంతాల్లో చిరుతల సంచారం లేగ దూడలపై దాడులు చేసి చంపేయడం వంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల చిరుతల సంచారం పెరిగిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
అటవీ ప్రాంతాలలో, బోరు బావుల వద్దకు వెళ్లాలంటే భయాందోళనతో వెళ్లాల్సి వస్తుందని గ్రామాల ప్రజలు అంటున్నారు. మాచారెడ్డి మండలం అక్కపూర్ గ్రామానికి చెందిన అరిగే నరసయ్యకు చెందిన లేగ దూడపై బుధవారం చిరుత దాడి చేసి లేగ దూడను చంపి వేయడం కలకలం రేపింది. ఇటీవల వరుస ఘటనలు కామారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం వెలుగు చూస్తున్నాయి. అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారాలను పసిగట్టేందుకు ఫ్లాష్ కెమెరాలను అమర్చిన చిరుతలు మాత్రం అటవీ ప్రాంతంలో సంచారం చేస్తే గ్రామాల, తండాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టేందుకు బోనులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పెద్ద పులి సంచారం నుంచి జిల్లా ప్రజలు తేరుకోకముందే చిరుతల సంచారం జిల్లా వ్యాప్తంగా వెలుగు చూడడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.






