05-07-2025 02:09:22 PM
భయాందోళనతో రైతులు, గ్రామస్తులు
దౌల్తాబాద్,(విజయక్రాంతి): రాయపోల్ మండలంలోని వడ్డేపల్లి అటవీ ప్రాంతంలో మరోసారి చిరుత పులి(Leopard) సంచారం కలకలం రేపింది. గత రెండు నెలల క్రితం ఇదే ప్రదేశంలో చిరుత పులి సంచరించి రెండు కుక్కలపై దాడి చేసి చంపింది. ఏడు నెలల క్రితం రెండు పిల్లలతో కలిసి తిరుగుతూ కనిపించింది. శుక్రవారం సాయంత్రం మరోసారి వడ్డేపల్లి అటవీ ప్రాంతంలో కనిపించడంతో ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలా చిరుత పులి కనిపించిన ప్రతిసారి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగానే చిరుత పులి జాడ కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కెమెరాలకు చిక్కడం లేదు. చిరుత పులి ఎప్పుడు ఒకే చోట ఉండదని తరచూ తిరుగుతూ ఉంటుందని కాబట్టి ఏ క్షణంలో చిరుత పులితో ప్రమాదం వస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..