2 April, 2026 | 5:35 PM

సింగరేణిలో సజీవసమాధి

04-12-2024 02:30 AM

ఇసుక బంకర్ కూలి హెడ్‌ఓవర్ మెన్ మృతి

రామగుండం, డిసెంబర్ ౩: పెద్దపల్లి జిల్లా సింగరేణి రామగుండం -2లో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో మూసేసిన జీడికే 7 ఎల్‌ఈపీ గని వద్ద ఇసుక బంకర్ కూలిన ఘటనలో హెడ్ ఓవర్ మెన్  సత్యనారాయణ సజీవ సమాధి అయ్యాడు. ఇసుక బంకర్ వద్ద హెడ్ ఓవర్మెన్ తీట్ల సత్యనారాయణ అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నాడు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సత్యనారాయణ బంకర్‌లో పడగా, అతడిని ఇసుక కప్పేసింది. దీంతో సత్యనారాయణ ఇసుక కిందే సజీవ సమాధి అయ్యాడు. యైటింక్లున్ కాలనీలో  నివాసం ఉండే సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద ఘటన తెలుసుకుని సింగరేణి యూనియన్ నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.

సత్యనారాయణ మృతితో రామగుండం డివిజన్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రమాద ఘటనపై సింగరేణి అధికారులు విచారణ చేపట్టారు. బాధిత కుటుంబానికి సింగరేణి ఆర్థిక సాయం చేయాలని టీబీజీకేఎస్, ఇతర సంఘాల నాయకులు కోరారు.