07-05-2024 12:41:48 AM
రూ.30 కోట్లకుపైగా.. స్వాధీనం చేసుకున్న ఈడీ
ఝార్ఖండ్ మంత్రి పీఏ పనిమనిషి ఇంట్లో లభ్యం
6 మెషీన్లతో 13 గంటల పాటు లెక్కించిన అధికారులు
రాంచీ, మే 6: సార్వత్రిక ఎన్నికల వేళ ఝార్ఖండ్లో నోట్ల గుట్టలు బయటపడటం తీవ్ర కలకం రేపాయి. నగదును అధికారులు మెషీన్ల ద్వారా లెక్కించారు. గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగిర్ ఆలమ్ పీఏ పనిమనిషి ఇంట్లో ఈడీ దాడులు చేయగా.. లెక్కల్లోకి రాని కోట్ల రూపాయల విలువైన కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ౬ మెషీన్లతో ఏకంగా 13 గంటల పాటు నిర్విరామంగా ఈ మొత్తాన్ని లెక్కించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి పనుల విభాగంలో చీఫ్ ఇంజి నీర్గా పనిచేసిన వీరేంద్ర రామ్ అనే అధికారిని మనీలాండరింగ్ కేసులో 2023 ఫిబ్రవరిలోనే ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
దర్యాప్తులో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వీరేంద్ర రామ్కు చెందిన పలు ప్రాంతాల్లో సోమవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగిర్ ఆలమ్ పీఏ సంజీవ్ లాల్ పనిమనిషి గదిలో భారీగా నగదు లభ్యమైంది. ఈ నగదు విలువ దాదాపు రూ.30 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఓ గదిలో నోట్ల కట్టలు కుప్పలు కుప్పలుగా పేర్చి ఉన్నట్టు గుర్తించారు. ‘ఝార్ఖండ్లో అవినీతి ముగియట్లేదు. ఇప్పుడు పట్టుబడ్డ డబ్బును ఎన్నికల్లో వాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల కమిషన్ వారినై చర్యలు తీసుకోవాలి’ అని ఝార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ సహదేవ్ డిమాండ్ చేశారు. కాగా, దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని మంత్రి ఆలంగిర్ ఆలమ్ చెప్పారు.
ఎవరీ వీరేంద్ర రామ్
గ్రామీణాభివృద్ధి పనుల విభాగంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసేవారు. అయితే పలు ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలు జరిగాయాన్న ఆరోపణలతో ఈడీ ఆయనను 2023 మార్చిలో అరెస్టు చేసింది. టెండర్ల కేటాయింపుల్లో కాంట్రాక్టర్ల నుంచి భారీ స్థాయిలో కమీషన్లు తీసుకునేవారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ ఆయనను అదుపులోకి తీసుకుని, ఆయనకు సంబంధించిన దాదాపు రూ.39 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇదే కేసులో విచారణ చేసేందుకు ఆయనకు సంబంధించినవిగా భావిస్తున్న పలు ప్రాంతాల్లో ఒకేసారి ఈడీ సోదాలు నిర్వహించింది.