07-05-2024 12:44:22 AM
లిక్కర్ స్కాంలో బెయిల్ నిరాకరణ
పిటిషన్ కొట్టివేసిన రౌస్ అవెన్యూ కోర్టు
నేడు స్వయంగా కోర్టుకు కవిత హాజరు
న్యూఢిల్లీ, మే 6: లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. లోక్సభ ఎన్ని కల నేపథ్యంలో తాను స్టార్ క్యాంపెయినర్గా ఉన్నానని, తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఈడీ, సీబీఐ కేసుల్లో రెండు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హత ఉంటుందని కవిత తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు.. రెండు కేసుల్లోనూ బెయిల్ ఇవ్వడం కుదరదంటూ పిటిషన్లను కొట్టేసింది. లిక్కర్ స్కాంలో ఆమె పాత్రపై కీలక విచారణ జరుగుతోందని, ఈ కేసులో ఆమెనే ప్రధాన సూత్రధారి అని ఈడీ కోర్టుకు తెలిపింది. ఆమెకు ఈ సమయంలో బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేస్తారని కోర్టుకు ఈడీ తెలిపింది. ఇరు వాదనలు విన్న సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ భజ్వా.. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.
ఈడీ కేసులో తీవ్ర ఆర్థిక నేరాల అభియోగాల కేసులో బెయిల్ మంజూరుకు అనుసరించాల్సిన విధివిధానాలపై గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన కేసుల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఉదహరించి కవిత బెయిల్ మంజూరు అభ్యర్థనను రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. మనీలాండరింగ్ అభియోగాల కేసులో బెయిల్కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. ఆ కేసులో విధించిన షరతులను కోర్టు తీర్పులో పేర్కొంది. నేరారోపణల స్వభావం, వాటికి సంబంధించిన సాక్షాధారాల స్వభావం, నేరారోపణల నిరూపణ జరిగితే శిక్ష తీవ్రత, నిందితుడి స్వభావం, నిందితుడి పలుకుబడి.. వంటివి పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పింది.
ఈ కారణాల వల్ల కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం వర్సెస్ సీబీఐ, విజయ మదన్ లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ప్రశాంత్ సింగ్ భాటి వర్సెస్ ఎన్సీటీ ఢిల్లీ, నిమ్మగడ్డ ప్రసాద్ వర్సెస్ సీబీఐ, సత్యేంద్ర కుమార్ జైన్ వర్సెస్ ఈడీ.. తదితర కేసులను కూడా కోర్టు ప్రస్తావించింది. కవితపై నమోదైన కేసులు దర్యాప్తు దశలో ఉన్నందున, ఆమెపై అభియోగాలు తీవ్రమైనవి అయినందున బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున కవితకు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసులోని అభియోగాలు, పరిస్థితులను బేరీజు వేశాకే బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది.
దర్యాప్తు సంస్థల బలమైన వాదనలు
కేంద్ర దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవిస్తూ... ఆమె దాఖలు చేసిన రెండు వేరు వేరు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించారు. లిక్కర్ పాలసీ కేసులో కవిత కింగ్ పిన్గా పేర్కొన్న దర్యాప్తు సంస్థల వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని ఇప్పుడు బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్షాలను కవిత తారుమారు చేసే అవకాశం ఉందన్న వాదనతో ఏకీభవించారు. అందువల్ల కవిత బయటకు వస్తే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని భావిస్తున్నట్లు తీర్పులో పొందుపరిచారు. గతంలోనూ కవిత ఆధారాలు ధ్వసం చేసారని, మొబైల్ డేటా డిలీట్ చేసారని, సాక్షులను బెదిరించారన్న దర్యాప్తు సంస్థల వాదనలను తోసిపుచ్చలేమని జగన్మోహన్ వర్సెస్ సీబీఐ ఆదేశాల్లో ప్రస్తావించారు. అలాగని కవిత మెన్షన్ చేసిన అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. జైల్ అధికారులు వైద్యం అందించగలిగితే... అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వలేమన్న ఈడీ వాదనలను ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన సమీర్ మహేంద్ర వర్సెస్ ఈడీ కేసులో తీర్పును ప్రస్తావించారు.
నేడు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్న కవిత
కోర్టు ముందు నేరుగా హాజరయ్యేందుకు అనుమతించాలన్న పిటిషన్పై కవితకు ఊరట దక్కింది. గతంలో విధించిన జ్యూడీషియల్ కస్టడీ నేటితో ముగియనుండంతో ఆమెను కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుం ది. అయితే... గత నెల 26న విచారణ సందర్భంగా తిహార్ జైలు సిబ్బంది ఆమెను వర్చువల్ మోడ్ లో జడ్జి ముందు హాజరుపరిచారు. ఈసారి నేరుగా కోర్టు ముందు హాజరయ్యేందుకు అనుమతించాలని గత శుక్రవారం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిపిన స్పెషల్ జడ్జి..కవితను నేరుగా కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం కవిత మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తొలుత ఆమెను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆమెను తీహార్ జైలుకు పంపారు. ఏప్రిల్ 11న తీహార్ జైలులో కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కాగా, ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైలులోనే ఉన్నారు.
ఎన్నికల ప్రచారం చేయాలి.. బెయిల్ ఇవ్వండి..
కవిత తరపున సీనియర్ అడ్వొకేట్లు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి, నితేశ్ రాణా, మోహిత్ రావు గతంలో వాదించారు. బీఆర్ఎస్ స్టార్ క్యాంపేయినర్ గా కవితను ప్రకటించారని తెలుసుకొని సీబీఐ అరెస్ట్ చేసిందని వారు వాదించారు. కవితను టెర్రరిస్టు, కరుడుగట్టిన నేరస్థురాలిగా ట్రీట్ చేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కవితకు ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వాలన్నారు.