26-11-2025 10:58:23 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కారు- బైకు ఢీకొనడంతో డీసీఎం కిందపడి వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెంకటాపూర్ గ్రామం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు(45) నాగర్ కర్నూల్ నుంచి స్వగ్రామానికి బైకుపై వెళుతుండగా వెంకటాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో బిజినపల్లి నుండి నాగర్ కర్నూల్ వైపు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఆ వెంటనే వెనకనుండి వస్తున్న డీసీఎం వాహనం గాయపడిన వ్యక్తి పైనుంచి వెళ్లడంతో కాళ్లు చేతులు నలిగిపోయాయి తీవ్ర రక్తస్రావంతో ఉన్న వ్యక్తిని స్థానికులు 108 సాయంతో జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.