21-06-2025 08:56:58 PM
అన్యమతంలోకి మార్చడమే వారి లక్ష్యం..
హిందూ ధర్మంపై దాడిని తిప్పికొట్టండి..
రామచంద్రమిషన్ చేస్తున్న సేవలు భేష్..
యోగా... ప్రపంచానికి మోదీ అందించిన మహా ‘యోగం’
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్..
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో, అలాగే తిమ్మాపూర్ రామచంద్ర మిషన్ నిర్వహించిన యోగా వేడుకులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) పాల్గొన్నారు. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ ఆంధ్రాలో కొందరు చేస్తున్న వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇట్లాంటి వ్యాఖ్యలతో హిందూ మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి అన్యమతంలోకి మార్చుకోవాలనే కుట్ర జరుగుతోందన్నారు. ఇది ముమ్మాటికీ హిందూ ధర్మంపై జరిగిన దాడిగా భావించి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.
మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలంలోని రామక్రిష్ణానగర్ కాలనీలో రామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన యోగా వేడుకలకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... అన్ని టెన్షన్లు దూరం చేసిన మానసిక ప్రశాంతత కలిగించే శక్తి యోగా, ధ్యాన ప్రక్రియలకు ఉందని చెప్పారు. ఈ విషయంలో రామచంద్ర మిషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. హిందూ ధర్మ రక్షణ కోసం రామచంద్ర మిషన్ చేస్తున్న సేవలు ఎనలేనివని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఉదయం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ యోగా వేడుకలకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు ప్రధానమంత్రి మోదీయేనని కొనియాడారు.
‘‘ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన 2014లో ఇదే రోజున (జూన్ 21) ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా ‘యోగా’ గొప్పతనాన్ని, యోగావల్ల జరిగే మేలును వివరిస్తూ ‘అంతర్జాతీయ యోగా డే’ నిర్వహించాలని ప్రతిపాదించిన నాయకుడు మోదీ. ఆయన కృషివల్లే ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ జరుపుకోవాలని ప్రకటించింది. ఇయాళ ప్రపంచలోని 200 దేశాలకుపైగా ప్రజలు యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నారంటే మోదీ చేసిన కృషి, మన దేశ సంస్క్రుతి, సాంప్రదాయాలపట్ల ఉన్న నిబద్దతే కారణం’’అని పేర్కొన్నారు. ఇవాళ ప్రపంచంలో ఏ దేశాల మధ్య చూసినా ఉద్రిక్త పరిస్థితులే కన్పిస్తున్నాయి.
రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్ ఇరాన్ యుద్దాలతోపాటు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద చర్యలతో ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. ఇటువంటి తరుణంలో దేశాల మధ్య, మనుషుల మధ్య వైరం తగ్గించడానికి ‘యోగా’ ఎంతో మేలు చేస్తుంది. టెన్షన్లను దూరం చేసి మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతత కలిగించే సాధనమే యోగా. యోగ అంటే సాధన చేయడం.. అంతిమంగా మానవత్వాన్ని సాధించడమే యోగా లక్ష్యం. ప్రపంచమంతా మానవత్వం పరిమళిస్తే ఇక యుద్దాలకు తావే ఉండదు. అంతటి గొప్ప శక్తిని మోదీ నాయకత్వంలో ప్రపంచానికి అందించిన మహా’యోగమే యోగా..’ అని తెలిపారు.