07-06-2025 02:55:36 PM
తాము సంక్షేమానికై మొదటినుండి కృషి
ఈద్గాను దశలవారీగా అన్ని రకాలుగా అభివృద్ధి
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా శనివారం నల్గొండ జిల్లా మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లింలను కలుసుకొని, రాష్ట్ర, జిల్లా ముస్లిం ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా బక్రీద్, రంజాన్ పండుగలను ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున జరుపుకొంటారని, ఈ రెండు పండుగలు త్యాగాలకు ప్రతీకగా నిర్వహించుకోవడం మనం చూస్తున్నామన్నారు.
బక్రీద్ సందర్భంగా అందరూ బాగుండాలని ఆయన అల్లాను ప్రార్థించారు. దేశంలోని పరిణామాలను గమనిస్తూ మతసామరస్యం పాటిస్తూ సెక్యులర్ భావాన్ని కాపాడుకుంటూ రాష్ట్ర ,జిల్లా ప్రజలు ముందుకు వెళ్లాలన్నారు.తాము ముస్లిం మైనారిటీ ప్రజల సంక్షేమానికై మొదటినుండి కృషి చేస్తున్నామని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ను కొట్లాడి కల్పించడం జరిగిందని, ఇప్పటికీ అది కొనసాగుతున్నదని అన్నారు. పేద ముస్లిం మైనారిటీ ప్రజల అభివృద్ధికి ఉపాధి, ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నామని, వారి సొంత కాళ్లపై వారు నిలబడే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకోవడంతో పాటు, వ్యాపార రంగంలో రాణించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అంతేకాక పేద ముస్లింలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టామని, ఏ ఇబ్బంది ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, మునుగోడు రోడ్ లో ఉన్న ఈద్గాను దశలవారీగా, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి పేదవాడికి అండగా నిలుస్తామని ఆయన తెలిపారు. నల్గొండ పట్టణంలో 34 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా దీనిని ప్రారంభించుకోబోతున్నామని,ఈ కేంద్రం ద్వారా మహిళలు టైలరింగ్ తో పాటు, ఎంబ్రాయిడరీ తదితర అన్ని రకాల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, మహిళలు, పేద వారు సొంతంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఆర్ డి ఓ వై.అశోక్ రెడ్డి, స్థానిక తహసిల్దార్ హరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వివిధ వార్డుల కౌన్సిలర్లు ముస్లిం మత పెద్దలు తదితరులు ఉన్నారు.