13-06-2025 11:45:41 PM
మంచినీటి శుద్దీకరణ యంత్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయితి రాజ్ మంత్రి సీతక్క
ములుగు,(విజయక్రాంతి): ప్రతి ఇంటికి సూక్ష్మజీవుల కాలుష్యం లేకుండా నీరు అందించుటకు నీటి శుద్దీకరణ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయితి రాజ్ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నీటి శుద్దీకరణ యంత్రాన్ని (ఆటోమేటిక్ క్లోరినేషన్ డౌసింగ్ సిస్టము)రాష్ట్ర పంచాయితి రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణలోనే మొట్టమొదటగా ఏర్పాటు చేయబడిన "ఈ సాంకేతికత లక్షలాది మందిని తాగునీటి సమస్య నుండి కాపాడుతుందని, ప్రతి గ్రామీణ ఇంటికి సూక్ష్మజీవుల కాలుష్యం లేకుండా నీరు అందుతుందని,సెన్సార్ పీడ్బ్యాక్ ఆధారంగా ఆటోమేటెడ్ డోసింగ్ అవుతుంది. మానవ తప్పిదాలు, నిర్వహణ ప్రయత్నాలను బాగా తగ్గిస్తుందని తెలుపుతూ ఈ సాంకేతికత జల్ జీవన్ మిషన్ కోసం ఒక ముఖ్యమైన ముందడుగు అని సార్వత్రికంగా స్వచ్ఛమైన తాగునీటిని పొందాలనే జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని తెలిపారు.ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ కంపెని ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ వ్యవస్థ జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం ద్వారా ఎంపానెల్ చేయబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపాల్ కమిషనర్ సంపత్,ప్రజా ప్రతినిధులు,సంబంధిత అధికారులు,మాజి పంచాయతీ కార్యదర్శి రఘు,తదితరులు పాల్గొన్నారు.