తెలంగాణ జల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం
హైదరాబాద్: ఈ నెల 23 నుంచి కృష్ణా ట్రైబ్యునల్ విచారణ దృష్ట్యా నీటిపారుదల రంగనిపుణులు, న్యాయనిపుణులతో శనివారం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్(Senior Advocate Vaidyanathan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ జల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని.. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 71 శాతం డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. న్యాయంగా రావాల్సిన నీటివాటాను సాధిస్తామని.. ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తామని అన్నారు. తాగు, సాగునీటితో సహ పరిశ్రమలకు నీటి వినియోగానికి చర్యలు తీసుకుంటామని.. ట్రైబ్యునల్ విచారణ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి సమీక్షిస్తారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.






