06-09-2025 05:01:52 PM
గద్వాల టౌన్: గద్వాల పట్టణంలోని బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ప్రభుత్వం,ఇక్కడి పాలకులు ఎందుకింత హడావిడి చేస్తున్నారని గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్ బాసు హనుమంతు నాయుడు ప్రశ్నించారు. శనివారం జిల్లా కేంద్రం లోని తన నివాస గృహం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. గత కెసిఆర్ ప్రభుత్వంలో 41 ఎకరాల్లో రూ.85 కోట్లతో 1,275 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు శ్రీకారం చుట్టి నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కలర్లు మార్చి, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి ప్రారంభిస్తున్నట్లు హడావిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
నేటి సర్కారు గృహ ప్రవేశాలు చేయించడం చూస్తే సొమ్ము ఒకరిది,సోకు ఒకరిది అన్న సామెత గుర్తొస్తున్నదన్నారు. మా బిఆర్ఎస్ నాయకులను పోలీసులతో ఎక్కడకక్కడ అరెస్టు చేపించి,మంత్రులు పర్యటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నీటి వసతి, సరైన సిసి రోడ్లు, లేకున్నా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వస్తుందని భయంతోనే ఓపెన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.