09-06-2025 02:03:17 AM
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోపీనాథ్కు ఈనెల 5న గుండెపోటు రావ డంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
కార్డియాక్ అరెస్టుకు గురైనట్లుగా వైద్యులు తెలిపారు. సీపీఆర్తో చేయడంతో బీపీ, నాడీ సాధారణ స్థితిలోకి రావడానికి ఐసీయూలోని వెంటిలేటర్పై ఆయనకు చికిత్స కొనసాగిం చారు. కొన్నాళ్లుగా గోపినాథ్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.
మూడునెలల క్రితం కూడా ఆయనకు ఆరోగ్య సమస్యలు రావడంతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మాగంటి ఆరో గ్యపరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచా రు. గోపీనాథ్కు భార్య సునీత, కుమారుడు వాత్యల్యనాథ్, కుమార్తెలు అక్షర నాగ, దిశిర ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని మాదాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన మృతిపట్ల పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నిక..
మాగంటి గోపీనాథ్ జూన్ 2, 1963న హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు. 1980లో ఆయన ఇంటర్మీడియట్ను వెంకటేశ్వర ట్యూటోరియల్స్లో పూర్తిచేశా రు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. 1985నుంచి 1992వర కూ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశా రు. ఎన్టీఆర్ స్వయంగా మాగంటికి నియామక పత్రాన్ని అందజేశారు.
1987, 1988 లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(హుడా) డైరెక్టర్గా, 1988 నుంచి 1993 వరకూ వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో మాగంటి పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన ఎంఐఎం అభ్యర్థి నవీన్ యా దవ్పై 9,242 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన గోపీనాథ్ 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పీ విష్ణువర్ధన్రెడ్డిపై 16,004ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2023లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై 16,337 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరసగా మూ డుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
2018 లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అనేక కార్యక్రమాలను విజయవంతం చేశారు. ప్రజానాయకుడిగా ఎదిగిన ఆయన మరణంతో పార్టీ కార్యకర్త లు విషాదంలో మునిగిపోయారు. ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ అనుచరులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
నివాళులు అర్పించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు
మాగంటి గోపీనాథ్ పార్థీవదేహానికి సీఎం రేవంత్రెడ్డి నివాళులు అర్పించారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్.. మాగంటికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అం తిమయాత్ర మాదాపూర్ నీరూస్, జూబ్లీహి ల్స్ చెక్పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిల్మ్నగర్ మీదుగా మహాప్రస్థానం వరకూ సాగింది.
ఈ అంతిమయాత్రలో కేటీఆర్, హరీశ్రావుతో సహా బీఆర్ఎస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. ఫిల్మ్నగర్లోని మహాప్రస్థానంలో గోపీనాథ్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి. ఆస్పత్రిలో ఆయన చికిత్సకు అయిన ఖర్చు మొత్తాన్ని చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
హుటాహుటిన ఆస్పత్రికి కేటీఆర్
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి కేటీఆర్ నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ అకాల మరణం పార్టీకి తీరని లోటని అన్నా రు. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి ఇక లేరనే విషయం తెలియగానే సతీమణి శైలిమ తన కుమారుడు హిమాన్షుతో కలిసి కేటీఆర్ అక్కడకు చేరుకున్నారు. శోకసముద్రంలో మునిగిన మాగంటి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మాగంటి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన కేటీఆర్ ఆయన పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. సోదరుడు, మృదుస్వభావి అయిన మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదుగుతూ వరసగా మూ డుసార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ప్రతినిత్యం ప్రజాసేవలో నిమగ్నమై న గోపీనాథ్ రాజకీయాల్లో హుందాతనానికి మారుపేరుగా నిలిచారన్నారు.
పాడె మోసిన కేటీఆర్, హరీశ్రావు
మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి మొదలైన మాగంటి అంతిమయాత్ర లో కేటీఆర్, హరీశ్రావు కలిసి పాడె మోశా రు. మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియ ల్లో కేటీఆర్తో పాటు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, మాగంటి అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలను అధికార లాంఛనాల తో నిర్వహించిన ప్రభుత్వానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
మాగంటి గోపీనాథ్ మృతికి పలువురు రాజకీయనాయకులు సంతాపం ప్రకటించారు. వారిలో ఏపీ మంత్రి నారా లోకేశ్, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావుగౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, పార్లమెంట్ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, రావుల చంద్రశేఖర్రెడ్డి, నామా నాగేశ్వరరావు, బీ వినోద్కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తదితరులు ఉన్నారు.
గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలి
* మాగంటి గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
మంత్రి దామోదర రాజనర్సింహ
* జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
* ‘మాగంటి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా.. ఆయన కుటుంబానికి నా సానుభూతి ప్రకటిస్తున్నా.
టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్
* జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ప్రయాణం టీడీపీతో ప్రారంభమైంది. మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
* జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి చింతిస్తున్నా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా
ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
* ‘గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా.., వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా.’
సీఎం రేవంత్ రెడ్డి
* ‘గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలి.. ఆయన అకస్మిక మృతి దిగ్భ్రాంతి కలిగిస్తోంది.. వారికుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
* ‘జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారు. ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారు.’
మాజీ సీఎం కేసీఆర్
‘జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు ఎనలేని సేవ చేశారు. గోపీనాథ్ ఆత్మకు శాంతిచే కూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’
శాసనమండలి చైర్మన్ గుత్తా
* ‘మూడుసార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపీనాథ్ ఎంతో కృషి చేశారు. ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు’
మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్
* ‘ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి దిగ్భ్రాంతి కలిగిస్తోంది. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’
కేంద్రమంత్రి కిషన్రెడ్డి
* మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్న నాయకుడి మరణం ప్రజలకు తీరని లోటు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలి.’
కేంద్రమంత్రి బండి సంజయ్
* ‘నిత్యం ప్రజల కోసం పరితపించే గొప్ప నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరం. ప్రజలే తన బలగం అని గోపీనాథ్ తరచూ చెప్పేవారు. మంచి మిత్రుడిని కోల్పోయా.. కష్ట కాలంలో ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా..’
మంత్రి శ్రీధర్బాబు
* ‘మూడుసార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపీనాథ్ ఎంతో కృషి చేశారు. గోపీనాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా. గోపీనాథ్ను కోల్పోవడం పార్టీకి తీరని లోటు’
మాజీమంత్రి కేటీఆర్
* ‘జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ అకాల మరణం అత్యంత బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నా. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన జీవితం ఆదర్శనీయం.’
మాజీమంత్రి హరీశ్రావు
* ‘మాగంటి గోపీనాథ్ మృతి తీవ్ర ఆవేదన కలిగించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’
మంత్రి కొండా సురేఖ
* ‘అనారోగ్యంతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించారన్న వార్త తనను తీవ్రంగా బాధించింది. వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ముందుకు సాగాలని, వారికి భగవంతుడు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా..’
మంత్రి జూపల్లి కృష్ణారావు
* ‘మాగంటి గోపీనాథ్ కింది స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎదిగారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’
మంత్రి పొన్నం ప్రభాకర్
* ‘తెలంగాణ ఏర్పాటు నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు విశేష సేవలందించా రు. గోపీనాథ్ మృతికి నా సంతాపం ప్రకటిస్తున్నా..ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి..’
మంత్రి సీతక్క
మాగంటి ప్రజానేత
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. విద్యార్ధి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చిన గోపీనాథ్ కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి మంచి ప్రజానాయకుడిగా పేరు గడించారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కా రానికి చిత్తశుద్ధితో కృషి చేసేందుకు ఆయన అనునిత్యం జనంతో మమేకమయ్యేవారన్నారు. ప్రజాసేవపై గోపినాథ్కున్న అంకిత భావమే ఆయనను జూబ్లీహిల్స్ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిం చిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ఏలేటి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
కంటనీరు పెట్టుకున్న కేసీఆర్
మాగంటి గోపీనాథ్ పార్థీవదేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఆయన నివాసానికి చేరుకున్న కేసీఆర్ గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. గోపీనాథ్ సతీమణి, కుటుంబసభ్యులను కేసీఆర్ ఓదార్చారు. గోపీ నాథ్ కుటుంబానికి పార్టీ అండగా ఉం టుందని కేసీఆర్ వారికి భరోసా కల్పించారు. మాగంటి గోపీనాథ్ పార్థీవదేహా న్ని చూసి కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యా రు. మాగంటి కుమారుడు వాత్సల్యనాథ్ను దగ్గరకు తీసుకొని కంటనీరు పెట్టు కున్నారు.