30 April, 2026 | 2:53 AM

మోస్ట్ వాంటెడ్ సలీమ్ పిస్టల్ అరెస్ట్

10-08-2025 12:07 AM

-నేపాల్‌లో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు

- అక్రమ ఆయుధాల సరఫరాలో కీలక నిందితుడు

- ఐఎస్‌ఐ, దావూద్ గ్యాంగ్‌తో సంబంధాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారత్ మోస్ట్ వాం టెడ్, అక్రమ ఆయుధాల సరఫరాలో కీలక నిందితుడు షేక్ సలీమ్ అలియాస్ సలీమ్ పిస్టల్ నేపాల్‌లో అరెస్టయ్యాడు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, భారత భద్రతా సంస్థలు నేపాల్ పోలీసుల సాయంతో శనివారం అతడిని అదుపులోకి తీసుకున్నాయి.

పాకిస్థాన్ నుంచి ఆయుధాలు దిగుమతి చేసి భా రత్‌లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. అంతేకాదు పాక్ ఐఎస్‌ఐ, మోస్ట్ వాంటెడ్ దావూద్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సలీమ్ పి స్టల్ లారెన్స్ బి ష్ణోయ్, హషీ మ్ బాబా వంటి టా ప్ గ్యాంగ్‌స్టర్‌లకు ఆయుధాలు సరఫరా చేసే కీలక వ్యక్తిగా ఉన్నాడు.

2018లో ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేసినప్పటికీ తప్పించుకుని విదేశాలకు పారిపోయాడు. దీంతో పోలీసులు షేక్ సలీమ్‌ను మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చా రు. సలీమ్ నేపాల్‌లో దాక్కున్నట్టు భద్రతా సంస్థలకు ఇటీవల సమాచారం అందింది. ఈ సమాచారంతో అతన్ని ట్రాక్ చేసి పట్టుకున్నాయి. ఢిల్లీలోని జాఫ్రాబాద్‌కు చెందిన షేక్ సలీమ్ 8వ తరగతి వరకు చదివాడు. 2000లో వాహన దొంగతనంతో అతడి క్రిమినల్ జీవితం ప్రారంభమైంది.