23-01-2026 12:20:39 AM
జిల్లా ఎస్పీ జానకి
రాజాపూర్ జనవరి 22: వాహనదారులు రోడ్డు భద్రత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ప్రారంభించిన ఆరైవ్ లైవ్ నినాదం మేరకు రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలేపల్లి సెజ్ ఆమ్నీల్ ఆంకాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని తెలిపారు.
అలాగే త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా హైవేల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం ఎస్పీ రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ లక్ష్మణ్ గుహీలోత్, జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్, రాజాపూర్ ఎస్ఐ శివానందం గౌడ్, పోలీసు సిబ్బంది, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.