26-12-2025 07:24:13 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): చిలుకూరు ఎస్సైని సస్పెండ్ చేసే వరకు పోరాటం ఆగదని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఇరుగు ప్రభు అన్నారు. మఠంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో 5వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కర్ల రాజేష్ మృతికి కారకులైన ఎస్సై సురేష్ రెడ్డిని, పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మఠంపల్లి మండల అధ్యక్షులు, ఎంఎస్పి పార్టీ అధ్యక్షులు, ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఆధ్వర్యంలో మఠంపల్లి మండల హెడ్ క్వార్టర్ లో 5వ రోజుకు చేరుకుంది.
ఈ దీక్షలో ఎమ్మాఆర్పిఎస్ మండల అధ్యక్షులు ఇరుగు ప్రభు మాట్లాడుతూ కర్ల రాజేష్ మృతికి ప్రధాన కారకుడైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి సస్పెండ్ ను అధికారికంగా ప్రకటించేంత వరకు నిరాహార దీక్షలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి అధ్యక్షులు కస్తాల వెంకటేశ్వర్లు,వీహెచ్పీఎస్ జిల్లా నాయకులు అమరవరపు సైదులు, మండల అధికార ప్రతినిధి కూరాకుల నరసయ్య,ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కూరాకుల సైదులు, కుర్రి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.