01-09-2025 12:39:57 AM
ప్రజా కవి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
నల్లగొండ టౌన్, ఆగస్టు 31: ప్రకృతితో మమేకమై జీవన తాత్వికతను తన కవిత్వంలో నేర్పుగా ఆవిష్కరించగల కవి మునాసు వెంకట అని ప్రజా కవి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. సృజన సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో నల్లగొండకు చెందిన ప్రముఖ కవి మునాసు వెంకట్ రచించిన దాపు కవితా సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
అస్తిత్వ ఉద్యమాలలో దళిత బహుజన కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవుల్లో మునాసు వెంకట్ ముందు వరుసలో ఉంటాన్నారని అభిప్రాయపడ్డారు. దాపు కవిత్వ పుస్తకాన్ని విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రముఖ విమర్శకులు అంబటి సురేంద్ర రాజు మాట్లాడుతూ అట్టడుగు వర్గ జీవితాలతో అంతర్జాతీయ స్థాయి కవిత్వం రాసిన వారు మునాసు వెంకట్ అని కొనియాడారు.
మరొక విమర్శకులు గుంటూరు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ నవ్యమైన అభివ్యక్తితో తనదైన శైలిలో కవిత్వం రాసిన మునాసు వెంకట్ కవిత్వం తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం అజరామరం అన్నారు. డాక్టర్ బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కవి గాయక సిద్ధార్థ, బైరెడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, భానుశ్రీ కొత్వాల్, పెరుమాళ్ళ ఆనంద్, అంబటి వెంకన్న, తుల శ్రీనివాస్, మేరెడ్డి యాదగిరి రెడ్డి, శీలం భద్రయ్య, బోధనం నర్సిరెడ్డి, పగడాల నాగేందర్, భూతం ముత్యాలు, సాగర్ల సత్తయ్య, బ, కస్తూరి ప్రభాకర్,మాదగాని శంకరయ్య, బండారు శంకర్ పాల్గొన్నారు.