29-12-2025 01:06:06 AM
గుర్రాల గొంది సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్
సిద్దిపేట, డిసెంబర్ 28 (విజయక్రాంతి): ప్రజల ఆశీర్వాదంతోనే రాజకీయ భవిష్యత్తు ప్రారంభమైందని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ అన్నారు. ఆదివారం గ్రామంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సర్పంచ్ మాట్లాడారు. ఉన్నత విద్య చదివినప్పటికీ గ్రామానికి సేవ చేయాలనే తపనతో రాజకీయ ప్రవేశం చేసినట్లు చెప్పారు. మొదటిసారి సర్పంచ గా ఓటమి చవిచూసిన నాకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కృషితో ఎంపిటిసిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారనీ గుర్తు చేశారు.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులు తన ప్యానెల్ (10 మంది వార్డు సభ్యులు) ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించి జిల్లాలోనే గుర్రాలగొంది గ్రామం ప్రత్యేకతను చాటిందన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించి, ఆశీర్వదించిన గ్రామస్తులకు జన్మతః రుణపడి ఉంటామని చెప్పారు. గ్రామం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు తన వంతు బాధ్యత నిర్వహిస్తానని చెప్పారు.
గ్రామంలోని యువకులకు ఉపాధి లక్ష్యంగా పనిచేసి ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పారు. తనకు సహకరించిన గ్రామస్తులకు తాను ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో ప్రజలు, యువకులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు, శాలువా, గజమాలతో ఘనంగా సన్మానించి, అభినందించారు.