12-07-2025 03:48:15 PM
సంస్కార భారతి ఆధ్వర్యంలో కళాకారులకు సత్కారం
కామారెడ్డి,(విజయక్రాంతి): కళాకారులు సంస్కృతి పరిరక్షకులని ప్రముఖ హైకోర్టు న్యాయవాది నెల్లుట్ల విజయ్ కుమార్ అన్నారు. శనివారం సంస్కార భారతి కామారెడ్డి ఆధ్వర్యంలో నటరాజ పూజా( గురుపూజ )కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని ప్రముఖ జానపద కళాకారులు రెడ్డి రాజయ్య, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారులు వంశీ ప్రతాప్ గౌడ్, శాస్త్రీయ సంగీత కళాకారులు సుహాసినికి వారి శిష్యులచే ఘనంగా పూలమాల వేసి శాలువాతో సత్కారించి గురుపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ హైకోర్టు న్యాయవాది నెల్లుట్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ, భారతీయ వైభవాన్ని వివరిస్తూ మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈనాటి యువతదేనని ఉద్బోధించారు. అధ్యక్షులు డా.సమ్మిరెడ్డి మాట్లాడారు. గురువులను సత్కరించుకోవడం వారి శిష్యుల అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాజయ్య బృందం జానపద గేయాలు పాడి అందరినీ ఉర్రూతలూగించారు. వంశీ ప్రతాప్ గౌడ్ శిష్యుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారిణి సుహాసిని శిష్య బృందం శాస్త్రీయ సంగీతం ఆలపించి శ్రోతలకు ఆహ్లాదాన్ని పంచారు. శిష్యుల ప్రదర్శనలు చూసిన గురువులు గర్వంగా ఉందని శిష్యులను కొనియాడారు.