12-07-2025 03:44:07 PM
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే విజ్ఞప్తి
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నెల్లికుదురు, గూడూరు మండలాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల స్థాయి పెంచి పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ విజ్ఞప్తి చేశారు.
మారుమూల గిరిజన ప్రాంతాలైన గూడూరు మండల కేంద్రంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 50 పడకలకు పెంచడంతోపాటు, వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా పరికరాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే నెల్లికుదురు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలని మంత్రిని కోరుతూ వినతి పత్రం అందజేశారు. తాను మంత్రిని కోరిన అంశాలపై సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.