calender_icon.png 20 June, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11 ఏళ్ల ఎత్తుపల్లాలు

10-06-2025 12:00:00 AM

మోదీ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014 నుంచి 2025 వరకు మోదీ మూడుసార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దేశ రాజకీయ చరిత్రలో ఎన్నో పరిణామాలు ఈ 11 ఏళ్లలో జరిగాయి. 2014లో ఘన విజయం సాధించిన బీజేపీ, 2019లో గతం కంటే ఎక్కువ మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చినా, మిత్రపక్షాలను కలుపుకొని సారధ్యం వహిస్తున్నది.

మోదీ నాయకత్వంలో ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో నిర్వచనాలు స్పష్టంగా కనిపిస్తూ వచ్చాయి. దేశ భద్రతకు ప్రాధాన్యం లభించింది. ఆర్థికం, పాలన, విదేశాంగ విధానం, సంక్షేమ పథకాల అమలు, అంతర్గత భద్రతలో పలు సవాళ్లను మోదీ ప్రభుత్వం ఈ 11 ఏళ్లలో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్థికాభివృద్ధిలో భారత్ అభివృద్ధిని ప్రపంచదేశాలు గుర్తించాయి.

‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ సిద్ధాంతంతో 140 కోట్ల దేశ ప్రజల ఆశీస్సులతోనే తమ ప్రభుత్వం పాలనలో గుణాత్మక మార్పు తెచ్చినట్లు మోదీ ప్రకటించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో, డిజిటల్ కరెన్సీ వాడకాన్ని ప్రోత్సహించడంతో ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ సాధ్యమైందని ప్రధాని చెప్పుకున్నారు. ‘మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్’తో ప్రభుత్వం డిజిటల్ ఇండియా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లింది.

ఎఫ్‌డీఐలు గణనీయంగా పెరిగాయి. ఎక్స్‌ప్రెస్ వేస్, విమానాశ్రయాలు, రక్షణరంగ కారిడార్లు పెరిగాయి.  పీఎం కిసాన్ పథకం కింద 11 కోట్ల మంది రైతులకు ఏడాదికి 6 వేల రూపాయలు నేరుగా ఖాతాల్లోకి వేస్తున్నా, రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న వాగ్దానం నెరవేరలేదు. ఏడాదికి 2.8 శాతం పెరిగిన రైతుల ఆదాయం, 10.4 శాతానికి పెరగడం ఇంకా సుదూర లక్ష్యమే. వ్యవసాయ రంగానికి సరైన తోడ్పాటు లేక ఉత్తరాదిన పెల్లుబికిన రైతుల ఆందోళన, హింస, అణచివేత మోదీ పాలనకు మచ్చగా మిగిలింది.

గ్రామీణ ప్రాంతాల్లో ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ఇప్పుడిప్పుడే సత్ఫలితాలనిస్తున్నది. ‘మేకిన్ ఇండియా’ విధానంతో ఆపిల్, సాంసంగ్, రక్షణ రంగ కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీకి భారత్‌ను ఎంచుకోగలిగాయి. ఉద్యోగాల కల్పనలో ఈ 11 ఏళ్లు అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదనేది స్పష్టం. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దేశంలో నిరుద్యోగం 5.1 శాతంగా ఉంది. యువతలో  ఇది ఎక్కువగా 13.8 శాతంగా వుంది.

ఆర్థికాభివృద్ధి, అంకుర సంస్థల అభివృద్ధిలోనూ నిరుద్యోగం కొనసాగడం విరుద్ధంగా కనిపిస్తున్నది. విద్య, వైద్య రంగాల్లో గణనీయ ప్రగతి కనిపించడం లేదు. ప్రయత్నాలు ఎన్ని చేసినా, మన విశ్వవిద్యాలయాలు గ్లోబల్ రాంకింగ్‌లో ఇంకా వెనుకబడే ఉన్నాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడులతో మొదలైన సర్జికల్ స్ట్రుక్ విధానం ఇటీవలి ఆపరేషన్ సిందూర్ దాకా కొనసాగింది.

దీంతో దేశ భద్రతకు భారత్ సైనిక చర్యలకు వెనుకాడదనే దృఢ నిశ్చయం మోదీ పాలనలో స్థిరపడింది. కశ్మీర్‌లో శాంతిభద్రతలు ఇంకా సమస్యలుగానే ముందు నిలిచాయి. దక్షిణాది నుంచి భాషా వివాదాలు, నియోజక వర్గాల పునర్విభజన రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సవాళ్లుగా పరిణమించనున్నాయి.