10-02-2026 01:49:22 PM
ఎఐటీయుసీ బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి, ఇప్పటి వరకు అమలులో ఉన్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఎఐటీయుసీ బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం గోలేటిలో డ్రైవర్లు, క్లీనర్లతో కలిసి సమ్మె వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ సింగరేణిలో నూతన బొగ్గు బావులు తవ్వాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కోరారు.
అలాగే కనీస వేతనంగా రూ.26,000 నిర్ణయించాలని, 12 గంటల పనివిధానాన్ని, హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. విదేశీ పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించి సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, వెంకటేష్, కుమార్, సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు.