10-07-2025 04:22:31 PM
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చిట్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ... ఆస్పత్రిలో వైద్యుల కొరత వల్ల రోగులకు సరైన వైద్యం అందడం లేదన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దవాఖానలో మెరుగైన వైద్యాన్ని అందించేదని, వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లను నియమించడం జరిగిందని తెలిపారు.
ప్రసవాల కోసం ప్రత్యేక గైనకాలజిస్ట్ డాక్టర్లను సైతం నియమించామని పేర్కొన్నారు. ప్రస్తుతం చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరగడంలేదని, రోగులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఆసుపత్రులపై నిర్లక్ష్య ధోరణి చూపెడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి ఆస్పత్రులపై రివ్యూలు నిర్వహించి,రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.