10-07-2025 01:22:32 AM
గతంలో ఫ్యాకల్టీ కొరత, సౌకర్య లేమి పేరిట నోటీసులు
తాజాగా నియామకాలు చేపట్టి సౌకర్యాలను కల్పించిన సర్కారు
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ లేరని, వసతులు లేవని నోటీసులు ఇచ్చిన ఎన్ఎంసీ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు న్న చర్యలకు సంతృప్తి చెందింది. ఫలితంగా రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కూడా జరిమానా పడలేదు. అలాగే 4,090 ఎంబీబీఎస్ సీట్లు యథావిధిగా కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది.
రాష్ట్రంలో తక్కు వ కాలంలోనే సర్కారు తీసుకున్న చర్యల కారణంగా ఫ్యాకల్టీ కొరత తీరిందంటూ ఎన్ఎంసీ ప్రశంసించింది. రాష్ట్రంలో ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు పెద్ద సంఖ్యలో ప్రభుత్వం పదోన్నతులను ఇచ్చింది. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు, అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించింది. వారందరికీ రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్గా, టీచింగ్ హాస్పిటళ్లకు సూపరింటెండెంట్లుగా నియమించింది.
అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 278 మందికి, ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుమా రు 231 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ చర్యలు ప్రారంభించింది.
అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ డీఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రమోషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నది. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటితో పాటు 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమో దం తెలిపింది.
పడకల సంఖ్య తక్కువగా ఉందంటూ..
కొన్ని టీచింగ్ హాస్పిటళ్లలో పడకల సం ఖ్య తక్కువగా ఉందని ఎన్ఎంసీ కొర్రీ వేసిన నేపథ్యంలో 21 టీచింగ్ హాస్పిటల్స్లో కలిపి సుమారు 6 వేలకుపైగా పడకలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ప్రతి కాలేజీ పర్యవేక్షణకు మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)లను నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీలు అన్ని కాలేజీల్లో పర్యటించి, కాలేజీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తు న్నాయి. రాష్ర్టంలో 2022 మధ్యలో ఒకేసారి 25 కాలేజీలు ఏర్పాటైన తీరును, దశలవారీగా మౌలిక వసతుల కల్పనను ఎన్ఎంసీకి అధికారులు వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4 నెలల్లో పూర్తిస్థాయిలో అన్ని సమ స్యలను పరిష్కరించుకోవాలని ఎన్ఎంసీ సూచించింది. ఈ మేరకు అన్ని కాలేజీలకూ పర్మిషన్లను యథావిధిగా కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది.