29-01-2026 02:34:28 PM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు(KCR ) నోటీసు జారీ చేయడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Telangana Pradesh Congress Committee) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్కు సిట్ అధికారులు నందినగర్ నివాసంలో గురువారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులపై మహేష్ గౌడ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ కేసు విషయంలో అందరినీ విచారిస్తేనే సమగ్ర దర్యాప్తు సాధ్యమవుతుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు.
ఎవరు నిందితులో పారదర్శకంగా తేలాల్సిందన్నదే ప్రజల ఆకాంక్ష అన్నారు. సిట్ ఎవరినైనా పిలిచి విచారించవచ్చన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడే అవకాశం లేదన్న అనుమానాలు ఉన్నాయన్న ఆయన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు(Panjagutta Police Station) సంబంధించిన క్రైమ్ నంబర్ 243/2024 కేసు విషయంలో బంజారాహిల్స్లోని నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసంలో సిట్ నోటీసు జారీ చేసిన సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆ నోటీసులో, సెక్షన్లు 166, 409, 427, 201, 120 (బి) ఐపీసీతో పాటు 34వ సెక్షన్, పీడీపీపీ చట్టంలోని సెక్షన్ 3, ఐటీ చట్టం 2000లోని సెక్షన్లు 65, 66, 66 (ఎఫ్)(1)(బి)(2), 70 కింద నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని సిట్ కేసీఆర్ను కోరింది.