31-05-2025 12:22:09 AM
-మంత్రి తుమ్మల కూడా 200 ఎకరాల్లో అదే పంటేసిండు
-రైతులంతా ఆ పంట వైపు మర్లండి
-మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, మే 30 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
శుక్రవారం హుస్నాబాద్లో జరిగిన ఆయిల్ పామ్ సాగు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయిల్ పామ్ సాగుతో రైతులకు కలిగే లాభాలను వివరించారు.
అధిక దిగుబడులు, ప్రభుత్వ ప్రోత్సాహం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రైతులు సంప్రదాయ పంటలతో ఎదుర్కొంటున్న అకాల వర్షాలు, వడగండ్లు, కోతులు, దొంగల బెడద వంటి సమస్యల నుంచి ఆయిల్ పామ్ సాగు రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. ‘ప్రకృతి వైపరీత్యాల్లో, దొంగలు, కోతుల బాధలు లేకుండా పంటలు రక్షించుకునే అంశంలో ఆయిల్ పామ్ ముందుంటుంది,‘ అని మంత్రి అన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం 200 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, ఇది ఈ పంట లాభదాయకతకు నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. 5 ఎకరాలకు పైన భూమి ఉన్న రైతులు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయిల్ పామ్ సాగు చేయాలని మంత్రి సూచించారు.
ఆయిల్ పామ్ సాగుకు ఎకరానికి రూ.42,000 సబ్సిడీ నాలుగు సంవత్సరాల వరకు వస్తుందని, నాలుగవ సంవత్సరం నుంచి రూ.60,000 నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని వివరించారు. ఆయిల్ పామ్ పంట పండించిన తర్వాత మార్కెటింగ్ సమస్యలు ఉండవని, గత ప్రభుత్వం ప్రారంభించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని తమ ప్రభుత్వం పూర్తి చేసి త్వరలోనే ప్రారంభిస్తుందని హామీ ఇచ్చారు.
హుస్నాబాద్ కేంద్రంగా ఆయిల్ కొనుగోలు చేస్తామని, ఖమ్మం జిల్లాకు మించి హుస్నాబాద్లో ఆయిల్ పామ్ సాగును పెంచాలని అధికారులను, రైతులను మంత్రి కోరారు. ఒకసారి పంట వేస్తే 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందని, ప్రస్తుతం అధికంగా దిగుమతి చేసుకుంటున్న ఆయిల్ పామ్ను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలకు భూసేకరణ త్వరలో పూర్తి చేసి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అనర్హులకు ఇండ్లు వస్తే రద్దు చేస్తం
ఆయిల్ పామ్ సదస్సు అనంతరం, మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో, హుస్నాబాద్ మం డలానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. గత 10 ఏళ్లలో హుస్నాబాద్ మండలానికి కేవలం 40 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని, అయితే ప్రస్తుతం తమ ప్రభుత్వం ఏడాదికి 200 ఇళ్ల చొప్పున నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని తెలిపారు.
లబ్ధిదారుల ఎంపిక పారదర్శ కంగా జరిగిందని, అనర్హులకు ఇళ్లు మంజూరైతే రద్దు అవుతాయని మంత్రి స్పష్టం చేశా రు. ఉచిత ఇసుక కూపన్లు, బాత్రూమ్ నిర్మా ణం కోసం ఉపాధి హామీ కింద డబ్బులు, ఇంకుడు గుంతలకు నిధులు, మహిళా సం ఘాల నుండి లక్ష రూపాయల రుణం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా మంత్రి పట్టాలు పంపిణీ చేశారు. మొదటి విడతలో 144 ఇండ్లు మంజూరయ్యాయని, మరో రెండు నెలల్లో రెండవ విడత ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్, 65 వేల ఉద్యోగాలు వంటి సంక్షేమ పథకాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హుస్నాబాద్ లో 150 పడకల ఆసుపత్రి నిర్మాణం, డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు, డబుల్ రోడ్ల నిర్మాణం, శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు