జేఈఈ మెయిన్లో మనోళ్లదే హవా
దేశవ్యాప్తంగా 26 మందికి 100 పర్సంటైల్ స్కోరు
- వీరిలో 10 మంది తెలుగు విద్యార్థులే
- తెలంగాణ నుంచి ఐదుగురు, ఏపీ నుంచి ఐదుగురు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. సోమవారం జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 26 మంది విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి 100 పర్సంటైల్ స్కోరు సాధించారు. ఇందులో 10 మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచి ఉండటం గమనార్హం.
వీరిలో తెలంగాణ, ఏపీ నుంచి ఐదుగురు చొప్పున ఉన్నారు. తెలంగాణ నుంచి మంత శివకామేష్, డొరనాల భవితేష్రెడ్డి, సాయి రిత్విక్రెడ్డి వెంకట్రెడ్డి వల్ల, వివాన్ శరద్ మహిశ్వరి, రిషి ప్రేమ్నాథ్ ఉండగా, ఏపీ నుంచి జొన్నల రోషణ్ మణిదీప్రెడ్డి, నరేంద్రబాబు గారి మహిత్, తుంగ దుర్గ సుప్రభాత్, పసల మోహిత్, బిజ్జం వెంకటచంద్రశేఖర్రెడ్డి ఉన్నారు. రాష్ట్రాలు, క్యాటగిరీలవారీగా టాపర్ల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
జేఈఈ అడ్బాన్స్డ్కు 23 నుంచి దరఖాస్తులు
జేఈఈ మెయిన్ సెషన్-1, 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును పరిగణలోకి తీసుకొని జాతీయ ర్యాంకులను కేటాయించారు. ఈ పరీక్షల్లో రాణించి టాప్లో నిలిచిన మొత్తం 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. మే 17న జరిగే ఈ పరీక్షకు ఈనెల 23 నుంచి మే 4 వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసా గనుంది.
ఇక అడ్వాన్స్డ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్ తుది కీపై పలు అభ్యంతరాలు రావడంతో ఎన్టీఏ స్పందించింది. విడుదల చేసిన తుది కీలో ఎలాంటి మార్పులు లేవని ఈమేరకు తెలిపింది. తొలుత ఫైనల్కీ విడుదల చేసిన ఎన్టీఏ, కొద్ది గంటల్లోనే తుది ఫలితాలను విడుదలచేసింది.






