12 March, 2026 | 3:46 AM

పద్మశాలి కార్తీక మాస వన భోజనాలు విజయవంతం

10-11-2025 08:00 PM

కృతజ్ఞతలు తెలిపిన కన్వీనర్ గడ్డం భాస్కర్..

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం, పరపతి సంఘాలు, సంక్షేమ, యువజన, మహిళా సేవా సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా శ్రీ ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించిన పద్మశాలి కార్తీకమాస వనభోజన మహోత్సవం విజయవంతమైన సందర్భంగా కుల బాంధవులందరికీ కార్తీక మాస సామూహిక వనభోజన మహోత్సవం కన్వీనర్ గడ్డం భాస్కర్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వన భోజనాల కార్యక్రమంలో  మహర్షి మార్కండేయ పూజ, గణపతి పూజ, అభిషేకం, హోమం వంటి కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగిందని, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలతో కూడిన ఉత్సవం ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా జరిగిందన్నారు.

ఈ మహోత్సవం విజయవంతం కావడానికి ఆర్థిక, హార్దిక సహాయ సహకారాలు అందించిన దాతలకు, నిరంతరం శ్రమించిన కార్యనిర్వహణ కమిటీ బాధ్యులకు, హాజరైన ప్రముఖులందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేకంగా ఈ కార్యనిర్వహణ కమిటీ చేస్తున్న కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్ని అందిస్తూ, ఎంతో శ్రద్ధతో సహాయ సహకారాలు అందించిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.