calender_icon.png 29 July, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

29-07-2025 01:41:31 AM

  1. సూత్రధారి సులేమాన్ షా మూసా, మరో ఇద్దరు హతం
  2. శ్రీనగర్‌లోని హర్వాన్ అటవీ ప్రాంతంలో.. గొయ్యి తవ్వి దానిపై టెంట్ వేసుకొన్న ముష్కరులు
  3. భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ పోలీసుల జాయింట్ ఆపరేషన్

ఆపరేషన్ మహదేవ్

న్యూఢిల్లీ, జూలై 28: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి భారత భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ‘ఆపరేషన్ మహదేవ్’ పేరుతో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదు లు హతమయ్యారు. శ్రీనగర్‌లోని మౌంట్ మహదేవ్ సమీపంలో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని భారత ఆర్మీ, సీఆర్పీ ఎఫ్ బలగాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులు చుట్టుముట్టాయి.

ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హ తమైనట్టు అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. వీరిలో ఒకరిని లష్కరే టాప్ కమాండర్ సులేమాన్ షా అలియాస్ ముసా ఫౌజీగా గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడికి ఇతడే కీలక సూత్రధారి. మరో ఇద్దరిని అబు హమ్జా, యాసిర్‌గా గుర్తించారు.

ఇందులో యాసిర్ కూడా పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. గతేడాది సోనామార్గ్ టన్నెల్‌లో జరిగిన ఉగ్రదాడికి అబు హమ్జా కారణమని పీటీఐ తెలిపింది. కాగా ఎన్‌కౌంటర్ స్థలం నుంచి 17 గ్రనేడ్లు, ఒక ఎం-4 కార్బైన్, రెండు ఏకే-47 రైఫిల్స్‌ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఆపరేషన్ సాగిందిలా?

హర్వాన్  ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల సమాచారంతో ౧౪ రోజులుగా సైన్యం, పోలీసు బలగాలు గాలింపు కొనసాగించాయి.. పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేశాయి. వారి కదలికలను కనిపెట్టేందుకు రెండు రోజుల క్రితం శాటిలైట్ కమ్యూనికేషన్ తిరిగి యాక్టివేట్ చేశారు. స్థానిక సంచార జాతుల సైతం ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందిం చారు. దీంతో సోమవారం పలు బృందాలను దాచీగమ్ అడవులకు తరలించారు.

ఉదయం 11.30 గంటల సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా కమాండోల బృందం ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించింది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక గొయ్యి తవ్వి దానిపై టెంట్ వేసుకొని అం దులో దాక్కున్నట్టు తెలుస్తోంది. ఈక్రమం లో గాలింపు చేపట్టిన భద్రతా దళాలకు లిడ్వాస్ ప్రాంతంలో తొలిసారి ఉగ్రవాదు లు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహ రించి ముగ్గురు ముష్కరులను మట్టుబె ట్టారు.

ఎవరీ సులేమాన్ ముసా?

హషీం ముసా అలియాస్ సులేమాన్ మూసా పాకిస్థాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్‌ఎస్‌జీ)లో మాజీ పారా కమాండో. సైన్యంలో ఉన్నప్పుడు కీలకమైన పదవి నుంచి తొలగించడంతో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)లో చేరినట్టు సమాచారం. సులేమాన్ ముసా అసాధారణ యుద్ధాలు చేయడంలో, రహస్య కార్యకలాపాలు నిర్వహించడంలో నిపుణుడు. కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి పాకిస్థాన్ ఆర్మీనే అతడిని నియమించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రదారిగా వ్యవహరించాడు. 

ఒక్కక్కరి తలపై 20 లక్షల రివార్డు

ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటక ప్రాంతం బై సరన్ లోయ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మ ంది పర్యాటకులు మృతి చెందారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్ర ంట్‌కు’కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్థారించారు. ఒక్కొక్కరి తలపై రూ. 20 లక్షల వరకు రివార్డును ప్రకటించారు. తాజా ఆపరేషన్‌లో ఇద్దరు పహల్గాం ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. 

ఆపరేషన్‌కు ‘మహదేవ్’ పేరు ఎందుకు?

దాచిగామ్ సమీపంలోని మహదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్‌కు ‘మహదేవ్’ అని పేరు పెట్టారు. ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రదేశం జబర్వన్ పర్వతాల మధ్య జరుగుతోంది. అందుకే దీనికి ఈ పేరును పెట్టారు. ఈ ఆపరేషన్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా చేపట్టాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా దళాలను నార్తర్న్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. దళాలు వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నాయని పేర్కొన్నారు.