30-10-2025 12:00:00 AM
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 1665 మంది గెస్ట్ ఫ్యాకల్టీల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈమేరకు బుధవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మొత్తం రూ.17,56,70,230 నిధులు విడుదల చేశారు.
ఒక్కొక్కరికి నెలకు రూ.20,994 చొప్పున వేతనాలను మంజూరు చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కే.మమేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవలే 398 మందికి జూన్ నుండి సెప్టెంబర్ వేతనాలను సైతం విడుదల చేయడంతోపాటు, నూతన జూనియర్ లెక్చరర్ల నియామకం ద్వారా ఉద్యోగాలు కోల్పోయిన 494 మందని తిరిగి విధుల్లోకి తీసు కుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ప్రభుత్వానికి, బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యకు వారు కృతజ్ఞతలు తెలిపారు.