30-10-2025 10:17:20 PM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్..
నూతనకల్: మొంధా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న, నీట మునిగిన పంటలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణమే నివేదిక సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పత్తి పంట పరిశీలన గురువారం కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ నూతనకల్ మండలం, మిర్యాల గ్రామాన్ని సందర్శించి, వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిర్యాల గ్రామానికి చెందిన రైతు ఎర్పుల రామ్మల్లు పత్తి పంటను కలెక్టర్ పరిశీలించారు.
రైతు రామ్మల్లు ఎన్ని ఎకరాలలో సాగు చేశారని కలెక్టర్ అడగగా, ఆయన నాలుగు ఎకరాలలో పత్తి సాగు చేసినట్లు వివరించారు.మేము ఇప్పటికే ఒకసారి పత్తి తీశాము. రెండోసారి తీయడానికి సిద్ధమవుతున్న సమయంలోనే భారీ వర్షాలు కురవడంతో పత్తి పూర్తిగా తడిచి దెబ్బతింది" అని రైతు రామ్మల్లు ఆవేదన వ్యక్తం చేశారు.రైతులతో మాట్లాడిన అనంతరం కలెక్టర్ పవార్, జిల్లా వ్యవసాయ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మొంధా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతీ రైతును గుర్తించి, ఏ పంట ఎంత మేరకు దెబ్బతింది అనే వివరాలతో కూడిన సమగ్ర నివేదికను త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు.నీట మునిగిన పొలాల వివరాలను కూడా ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు.నష్టం అంచనా వేసే ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు నష్టపరిహారం అందించేందుకు వీలుగా నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు