calender_icon.png 9 June, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపప్రసాదానికి పోటెత్తిన జనం

09-06-2025 01:41:57 AM

  1. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పంపిణీ
  2. 42 ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటు
  3. ప్రసాదం పంపిణీలో విషాదం.. గుండెపోటుతో వృద్ధుడి మృతి

ఖైరతాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): ప్రతీ సంవత్సరం మాదిరిగానే మృగశిర కార్తి రోజు బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదం కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రారంభించారు.  మంత్రి పొన్నంకు బత్తిని కుటుంబం చేప ప్రసాదం అందజేసింది.

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు సైతం హాజరై చేపమందు ప్రసాదాన్ని స్వీకరించారు. ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వేలాది మంది ఈ ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తదతర రాష్ట్రాల నుంచి తరలివచ్చారు.

వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13 కౌంటర్ల ద్వారా బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తోంది. ప్రజలు అధిక సంఖ్య లో రావడంతో 42 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాగా రెండు రోజుల పాటు బత్తిని కుటుంబం చేపప్రసాదాన్ని పంపిణీ చేయనుంది. 

140 ప్రత్యేక బస్సుల ఏర్పాటు..

నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, జేబీఎస్, ఎంజీబీఎస్, కాచిగూడ, శంషాబాద్ ఎయిర్‌పోర్టుల నుంచి దాదాపు 140 ప్రత్యేక బస్సులను ఏర్పా టు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 1,200 మంది పోలీసులతో బందోబస్తు, 70 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించారు. సోమవారం సాయంత్రం వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.

కాగా ప్రసాదం పంపిణీలో వి షాదం చోటుచేసుకుంది. క్యూలైన్‌లో నిలబడ్డ మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు, హఠాత్తుగా గుండెపోటు రావడంతో క్యూలైన్‌లోనే కుప్పకూలాడు. స్పందించిన పోలీస్ సిబ్బంది వెంటనే అతడికి సీపీఆర్ చేసినా, ప్రయోజనం లేకుం డాపోయింది. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.