15-08-2025 09:14:27 AM
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ(Independence Day) వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ఎర్రకోటపై నరేంద్ర మోడీ 12వ సారి జాతీయ జెండా ఎగురవేశారు. జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇది 140 కోట్ల మంది సంకల్ప పండుగ అన్నారు. సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం.. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే సమయమని తెలిపారు. కోట్ల మంది త్యాగాలతో స్వాతంత్య్రం వచ్చిందని ప్రధాని మోడీ వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ హీరోలకు ప్రధాని సెల్యూట్ చేశారు. మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారని కొనియాడారు. పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామని ప్రధాని పేర్కొన్నారు.
పహల్గామ్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారని, భార్య ముందే భర్తను చంపేశారు.. పిల్లల ముందే తండ్రిని చంపేశారు.. పాక్ ఉగ్రవాదులు మతాన్ని అడిగి మరీ మారణహోమం సృష్టించారని ఆయన మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్తో(Operation Sindoor) ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామని, మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. పాక్లోకి చొచ్చుకెళ్లి మరీ భారత జవాన్లు ముష్కరులను మట్టుబెట్టారని వివరించారు. మన సైన్యం ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిందన్న నరేంద్ర మోదీ ఉగ్రవాదులను, వారికి మద్ధతిచ్చేవారిని మేం వేర్వేరుగా చూడటంలేదని హెచ్చరించారు. అణుబాంబు బెదిరింపులను సహించేదిలేదని తేల్చిచెప్పారు. ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న ఆయన ఇకపై ఎవరి బ్లాక్మెయిల్ నడవదని హెచ్చరించారు. బ్లాక్మెయిల్కు పాల్పడితే ధీటుగా జవాబిస్తామని చెప్పారు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవని ప్రధాని పేర్కొన్నారు. సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వైపు దేశ యువత దృష్టిపెట్టాలని పిలుపునిచ్చిన ప్రధాని విదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై మనం ఎందుకు ఆధారపడాలి? పశ్నించారు.