15-08-2025 09:37:26 AM
మహబూబ్నగర్,(విజయక్రాంతి): మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar District) జడ్చర్ల సమీపంలోని ఎన్ హెచ్ 44 మాచారం ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. సీఐ కమలాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిజిఆర్ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు, లోడుతో లారీ హైదరాబాద్ వైపు వెళుతున్నాయి. జడ్చర్ల సమీపం లో మాచారం బ్రిడ్జి ప్రారంభంలో 30 నుంచి 40 వేగం బయలుదేరుతున్నట్లు తెలుస్తుంది.
వెనకనుంచి వచ్చిన సిజిఆర్ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా లారీని వెనకనుంచి ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు పరిస్థితి తీవ్ర విషమంగా ఉండగా మరో పదకొండు మందికి గాయాలు అయ్యాయి. మృతులలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతదేహాలను జిల్లా జనరల్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం చేరవేయడంతో పాటు క్షతగాత్రులను జడ్చర్ల ఆస్పత్రిలో(Jadcherla Hospital) వైద్య చికిత్సలు అందించేందుకు పంపించడం జరిగింది. పూర్తిస్థాయిలో ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కమలాకర్ తెలియజేశారు.