26-07-2025 12:02:32 AM
‘కమండలం పగలగొట్టే’ వ్యాఖ్యలపై బీజేపీ నేత ఎన్వీ సుభాశ్ ఆగ్రహం
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): మంత్రి పొన్నం ప్రభాకర్ ‘కమండలం పగలగొడతాం’ అని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ మతంలో పవిత్రమైన చిహ్నంగా భావించే కమండలంపై పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇన్చార్జి ఎన్వీ సుభాశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి హిందూ మతం పట్ల ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తున్నాయని ఆయన ఆరోపించారు. శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు కన్వర్ యాత్రలో కమండలాలు ధరించి శివుడిని పూజిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్య లు చేయడం బాధాకరమన్నారు.
పొన్నంపై చర్యలు తీసుకోవాలె
కాంగ్రెస్ గతంలోనూ శ్రీరాముడిని అపహాస్యం చేయడం, ‘కాషాయ ఉగ్రవాదం’ వంటి పదాలను ఉపయోగించడం ద్వారా హిందువుల మనోభావాలను అవమానించిందని సుభాశ్ గుర్తు చేశారు. పొన్నం ప్రభా కర్ వ్యాఖ్యలు ఇదే ధోరణిలో ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని.. పొన్నం వ్యాఖ్యలు పార్టీ అధికారిక వైఖరిని సూచిస్తాయా లేదా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిజంగా లౌకికవాదాన్ని విశ్వసిస్తే, ఈ నాయకుడిపై చర్య తీసుకోవాలన్నారు.