calender_icon.png 17 July, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాదరణలో పరుగు పందెం!

18-06-2025 12:00:00 AM

ప్రస్తుతానికి ఎవరి మనసూ నిండనిది, స్థిమితంగా ఉంచనిది ఏదైనా ఉన్నదీ అంటే అది ఫార్ములా ఈ కార్ రేస్ కేసు. అరెస్టు ఛాయలు పొంచి ఉంటాయి. కానీ, అరెస్టు ఉండదు. కేసులో ఏమంత పస లేదని అనిపిస్తుంది. కానీ, ఏ మూలనో ఏదో స్పార్క్ తచ్చాడుతుంది.

“అరెస్టు చేసుకుంటే చేసుకోండి. ఓ 15 రోజులు విశ్రాంతిగా ఉంటుందని” అంటా రు యువనేత కేటీఆర్. లా ప్రకారం  ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఈ-రేస్ కేసు కానీ, బీఆర్‌ఎస్ వర్సె స్ కాంగ్రెస్ రేసు మాత్రం తగ్గడం లేదు. ఏసీబీ మాత్రం తన పనిలో తాను నిమగ్నమైంది.

ఇదే జూన్‌లో ఓ దశకు తెచ్చే అవకాశం ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం తర్వాత సీఎం అంతటి ప్రాముఖ్యం, ప్రా చుర్యం సొంతమైన కేటీఆర్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రిగా ఫార్ములా ఈ కారు రేస్ తలపెట్టి సర్కారు మారడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఆ ఈ వెంట్ల సంప్రదింపుల్లో వివాదాస్పద, అనుమానాస్పద తీరుతెన్నులను గ్రహించి పట్టుకున్నట్టు భావిస్తున్న ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొలిటికల్ ఫార్ములా చట్టం పరిధీ పరిమితులతో రామన్నకు చెరసాల ముడిపడి ఉందనేది నిష్ఠుర సత్యం.

భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులుగా, సిరిసిల్ల శాసనసభ్యుడిగా ఉన్న కేటీఆర్ అరెస్టు (గనుక సంభవిస్తే) రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలదు. అభిమానులు, అనుచరులు రామన్నగా పిలుచుకునే కేటీఆర్‌పై చర్యలను అధికార కాంగ్రెస్ పార్టీవారు ఎలాగూ దర్జాగా సమర్థించుకొం టారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ సహజంగానే వ్యతిరేకిస్తుంది. విచారణకు పిలుపులతో ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలమవుతున్నది.

మధ్యలో బీజేపీ లైన్ తెలిసిందే. కానీ, సామాన్య ప్రజలు, తటస్థ వర్గాల స్పందన, అంతరంగం ఎలా ఉంటుందన్నదే కావాల్సింది. నిజానికి ఫార్ములా ఈ రేస్ సాధారణ ప్రజలకు సంబంధం లేనిదే. దాంట్లోని మంచిచెడులు, లాభనష్టాలపై వారికి మిగతా అంశాల స్థాయిలో ఆసక్తి ఉండదు. అటువంటప్పుడు ఈ పరిణామం ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనేది ఇప్పటికిప్పుడు తేలేది కాదు.

అయితే, తెలంగాణ సహా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పీఠానికి చేరుకునేందుకు వయా కేసులు, జైలు మార్గంగా ఓ భావన నెలకొంది. రూ. వేలు, లక్షల కోట్ల అవినీతి గత ప్రభుత్వంలో జరిగిందంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి సమాజం వినికిడిలో ఉన్న లెక్కల ప్రకారం మహా అయితే రూ.55 కోట్లు-  రూ.70 కోట్ల వ్యవహారంలోనే,

అదీ రూపాయి జేబులో వేసుకున్నట్టు ప్రాథమికంగా తేల క పోయినా కేటీఆర్‌ను అరెస్టు చేస్తే కాంగ్రెస్‌కు కలిగే రాజకీయ లబ్ధి ఏపాటిదో? బయటకు వచ్చాక తదుపరి అడుగులు రాష్ట్రవ్యాప్త పాదయాత్రతోనే పడతాయని కేటీఆర్ మీడియా ముఖాముఖిలో అప్పట్లోనే వెల్లడించారు. పాదయాత్ర కోసం జై లులో యోగాతో ఫిట్‌నెస్ సాధిస్తానన్నట్టుగానూ ఆయన చమత్కరించారు కూడా. 

ధర్మానికి విఘాతం కలిగిందా?

కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొలువు దీరాక కొన్నాళ్ళకే ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఆయన దృష్టిలో పడింది. కేసు ఉనికి మాత్రం ఈ ఏడాది ఆరంభంలో బహిర్గతమైంది. మరీ ముఖ్యంగా గడిచిన ఆరు నెలలనుంచి రాజకీయ ప్రభావిత అంశంగా చర్చలో ఉంది. ఎవరి వాదనలు, సమర్థనలు వారి వి. “ఇది తప్పు” అని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రస్తుత పాలకులు, “తప్పు కానే కాదు” అని గట్టిగా నిలబడేందుకు గత పాలకులు పోటాపోటీగా పాటు పడుతున్నారు.

మరో వంక అవినీతి నిరోధక శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  వాటి పనిలో అవి పడ్డా యి. ఇటీవలి మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్‌కు మస్తు ఒనగూరుతుందని కాం గ్రెస్ ప్రభుత్వం గర్వంగా, ఘనంగా చెప్పుకొచ్చింది. ఆ స్టేట్‌మెంట్లలో వాస్తవం ఉన్న ప్పుడు ఫార్ములా ఈ రేస్‌తోనూ హైదరాబాదుకు బాగా లాభం జరుగుతుందనే కడపటి ప్రభుత్వ ఉద్దేశం ఎలా అవాస్తవం కాగలదు? ఫార్ములా ఈ వృథా అయితే, అందాల పోటీలూ ఏమవుతాయీ? కాబ ట్టి విధానాలు, ప్రాథమ్యాలు, ప్రాధాన్యతలు పాలక పార్టీలనుబట్టి ఉంటాయి. ఇది తప్పు కానప్పుడు అదీ తప్పు కాదు కదా. 

ఈ రేస్‌కోసం సదరు సంస్థకు గత బీఆర్‌ఎస్ సర్కారు రూ. 44 కోట్లు హెచ్‌ఎండీఏ ఖాతానుంచి బదిలీ చేసింది. అ కౌంట్ టు అకౌంట్ లావాదేవీ జరిగింది. ప్రభుత్వంలో పాలక పార్టీ మారడంతో ప్రొసీజ ర్ ల్యాప్స్, అవకతవకల అనుమానాలు పొడచూపాయి. ఆ క్రమంలో అధికార దుర్వినియోగం, కుమ్మక్కు కుట్ర, దురుద్దేశంతో నిబంధనలను బేఖాతరు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్ల లో నష్టం వాటిల్లిందనే సారాంశంతో సం బంధిత ఉన్నతాధికారి ఫిర్యాదు మేరకు ఏసీబీ గతేడాది డిసెంబర్ 19న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇతర సెక్షన్లకు పదేళ్ల వరకూ శిక్ష పడే సెక్షన్ జత చేసి కేసు కట్టింది.

అక్కడి నుంచి ఆన్ పేపర్ దర్యాప్తు/ విచారణ మొదలైంది. ఈ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ ఈ సంవత్సర ప్రారంభం లోనే జనవరి 3న నోటీసు జారీ చేసింది. ఆ పరంపర కొనసాగుతోంది. మళ్ళీ ఈనెల 16న విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. దాదాపు 7 గంటలపాటు సుమా రు 60 ప్రశ్నలను ఏసీబీ వేసిందట. అప్పట్లోనే జనవరి 9న అటెండ్ అయినప్పుడు 7 గంటల్లో 82 ప్రశ్నలు కేటీఆర్ ఎదుర్కొన్నారనేది కథనం. మధ్యలో ఓసారి ఇదే కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ అదే జనవరి 16న వెళ్ళారు.

లాభనష్టాల బేరీజు

చట్టం, నిబంధనలు, నియమాలు, మార్గదర్శకాల ఉల్లంఘనలను ఎవరూ స్వాగతించరు. అదే సమయంలో ఒక్కోసారి ధర్మాన్ని అనుసరించే పరిస్థితి ఏర్ప డుతుంది. రెండు పర్యాయాల సుదీర్ఘ పాలనలో ఇలాంటివి సదుద్దేశంతోనే జరి గి ఉంటాయి. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అటువంటివి ఏమైనా చోటు చేసుకుంటున్నాయో లేదో? మరో పార్టీ ఏలుబడిలోకి వచ్చినప్పుడో, వెనుకా ముందో తెలుస్తుంది.

ఎటొచ్చీ ఎవరి పాలనలోనైనా ధర్మానికి విఘాతం కలిగిందా అనేదే ఇంపార్టెంట్. నిజానికి డ్రోన్ కేసులో గత ప్రభుత్వం కక్ష గట్టి మరీ రేవంత్‌రెడ్డిని చాలా కష్ట పెట్టిందనే ముద్ర తెలంగాణ సమాజంలో బలంగా పడింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వమూ ఫార్ములా ఈ కేసులో కావాలనే కేటీఆర్‌ను ఇబ్బంది పెడుతుందనే సంకేతాలు సమాజంలోకి పోతే, బీఆర్‌ఎస్ ప్రస్తుత స్థితి కాంగ్రెస్‌కు తదుపరి రాదా?

నైతికతకు వన్నెలద్దే సంప్రదాయాలను నెలకొల్పేందుకు రేవంతన్నలో ఆసక్తికి సరైన టైం ఇదే. రెండు పలకల సైజులో సన్నని రేకులమీద ‘అన్న వరం..రూ. 2 కే కిలో బియ్యం’ నినాదాలతో దివంగత ఎన్టీఆర్ అన్నగా ప్రాచుర్యానికి 1980 దశకం లో బీజం పడింది. అన్న లేదా ఎన్టోడు అని జనం ముద్దుగా పిలుచుకునేవారు. తనను ప్రజలు రేవంతన్నా అని ఆప్యాయంగా పిలుస్తున్నారని స్వయానా ఆయ నే చెబుతుంటారు.

అన్న అనే సంబోధనలో ఆత్మీయత ఉట్టి పడుతుంది. సార్ అనే పిలుపులో ఆత్మీయతకన్నా కృతకం ఎక్కువగా ఉంటుంది. అంతటి స్ట్రాంగ్ పొలిటీషియన్ వైయస్‌ఆర్‌నే సీఎం స్థానం లో ఉండి, తన తండ్రి మరణానికి కారకులైన వారిని వదిలేశానని చెప్పినట్లు జ్ఞాప కం. అలాంటివి స్ఫురణకు తెచ్చుకోవాలి. ప్రతిపక్ష నేతలైనా, అధికార పక్షం వారైనా మాట తూలడాలకు, రివేంజ్ పాలిటిక్స్‌కు ఎక్కడో చోట స్వస్తి పలకాలి. 

సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వారి ఉపన్యాసాలు, వ్యా ఖ్యానాలు చూడాలి, వినాలి. వైఎస్సార్, రోశయ్య వంటి పెద్దలు ఎదుటి పక్షం వారిపట్ల అభ్యంతరాలకు తావు లేకుండా, సమాజమూ ముసిముసి నవ్వులు చిందించేలా ఎలాంటి పద ప్రయోగాలు, సెటైర్లు సంధించేవారో యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీలు చూసుకుని మరోసారి ఆలకించాలి. వారి మాటల శైలితో ప్రేరణ పొందాలి.

ఇది యువనేత కేటీఆర్‌కూ వర్తిస్తుంది. ఆపై అవసరం మేరకు ఎవరైనా అనుసరించాలి. ప్రభుత్వ అధిపతిగా మంచిమాటలను, కక్షకు తావు లేని రాజకీయాలను మొదట రేవంతన్ననే ఫాలో కావాలి. ఆ తరువాత కూడా ప్రతిపక్ష నేతలు ముఖ్యంగా కేటీఆర్ లాంటి వారు ఆక్షేపణీయంగా మెదిలితే గనక చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఎట్లాగూ ఆమోదించదు.