04-05-2025 04:24:19 PM
టీపీసీసీ పరిశీలకులు, రాష్ట్ర కో- ఆపరేటివ్ ఆయిల్ షీడ్స్ ఆండ్ గోవర్ పేడరేషన్ ఛైర్మెన్ జంగా రాఘవ రెడ్డి...
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పని చేసే వారికే ప్రాధాన్యత అనీ, పార్టీలో సంస్థాగత పదవులు వస్తాయని టీపీసీసీ పరిశీలకులు, రాష్ట్ర తెలంగాణ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ అండ్ గోవర్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నిర్మాణ సంస్థాగత సన్నాహక సమావేశాలు చేపట్టారు. ఈ సమావేశానికి రాఘవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పార్టీ పదవులు ఆశించే వారు గ్రామ, మండల, బ్లాకు, పట్టణ పదవుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని వారి విన్నతులు పార్టీ అధిష్టానానికి నివేదిస్తామన్నారు. పదవులు ఇచ్చేది పార్టీ అధిష్టానమేనన్నారు. పదవుల నియామకంలో పారదర్శకతోనే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. పీసీసీ, ఏఐసీసీ సూచనల మేరకే పార్టీ పదవులు ప్రకటించబడతాయన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రహించాలన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టిన కేసీఆర్
మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని 7.50 లక్షల కోట్లు అప్పుల ఊబిలోకి నెట్టివేశారని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. కేసీఆర్ కు ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సీనియర్లకే పార్టీ అధిష్టానం సంస్థాగత పదవులు ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యులు రాంభూపాల్, చిలుముల శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కార్కూరి రాంచందర్, కన్నెపల్లి, నెన్నెల, భీమిని, కాసీపేట, వేమనపల్లి, బెల్లంపల్లి మున్సిపల్, రూరల్ లకు చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.