02-08-2025 12:00:00 AM
బెంగళూరు, ఆగస్టు 1: ఇంట్లో పని చేసే యువతిపై లైంగిక దాడి చేశాడంటూ దాఖలైన కేసులో బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు జేడీఎస్ మాజీ ఎంపీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మనువడు ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేలుస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. తీర్పు విన్న అనంతరం ప్రజ్వల్ కోర్టు హాలులోనే కన్నీరు పెట్టుకున్నాడు.
మైసూరు కేఆర్ నగర్లోని రేవణ్ణ ఇంట్లో పని చేసే ఓ మహిళ రేవణ్ణ తనపై లైంగికంగా దాడి చేశాడని, అది వీడియో తీసి పలుమార్లు బెదిరిస్తూ ఘాతుకానికి పాల్పడ్డాడని గతేడాది సైబర్క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రేవణ్ణ లైంగిక దాడి చేసిన సమయంలో బాధితురాలు కట్టుకున్న చీరను సీఐడీ (క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) కోర్టులో ఫిజికల్ ఎవిడె న్స్గా సబ్మిట్ చేసింది.
ఆ చీరపై రేవణ్ణ వీ ర్యం గుర్తులు ఉన్నట్టు ఫోరెన్సిక్ పరీక్షలో తే లింది. దీంతో రేవణ్ణ అత్యాచారానికి ఒడిగట్టినట్టు తేలింది. ఈ కేసులో సీఐడీ రెండు వేల పేజీల చార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు 123 ఆధారాలు కూడా సేకరించింది. 2024 డిసెంబర్లో విచారణ మొదలవగా ఆగస్టు 2025లో కోర్టు తీర్పు వెలువరించింది.
ఈ కేసులో కోర్టు 23 మంది సాక్షులను విచారించింది. ప్రజ్వల్ రేవణ్ణకు ఈ కేసులో 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించినా కానీ ఆశ్చపోనక్కర్లేదని పలువురు పేర్కొంటున్నారు. నేడు కోర్టు రేవణ్ణకు శిక్ష ఖరారు చేయనుంది.