11-10-2025 01:13:04 AM
- ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలి
- సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి
- టీజీఓల రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు
పాపన్నపేట,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 2023 నుండి పెండింగ్ లో ఉన్న 42 శాతం ఫిట్మెంట్ తో తెలంగాణ రెండవ పిఆర్సిని వెంటనే అమలు చేయాలని తెలంగాణ గజిటెడ్ అధికారుల కేంద్ర సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమైన విషయాలపై విస్తృత చర్చ జరిపి, పలు సమస్యలపై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించుకున్నారు.
అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 42 శాతం ఫిట్మెంట్ తో పాటు తెలంగాణ రెండవ పిఆర్సిని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం మరియు ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తిలో చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు వెంటనే అమలు చేయాలన్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరించాలన్నారు. పలు శాఖలలో పెండింగ్ లో ఉన్న అద్దె వాహనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఇంధనం పెరుగుదల దృష్ట్యా వాహనాల అద్దెకు రూ.34 వేల నుండి రూ.50 వేలకు పెంచాలన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల 62 సమస్యలపై సానుకూలంగా స్పందించి 25 డిమాండ్లను కొంతమేర పరిష్కరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.