19-10-2025 06:54:33 PM
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు..
క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత..
కాటారం (విజయక్రాంతి): క్రీడా మైదానంలో చూపించే కృషి, క్రమశిక్షణ జీవితంలో కూడా విజయానికి దారి తీస్తుందని క్రీడాకారులనుద్దేశించి యువతకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో నిర్వహించిన డిపిఎల్-10 క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించిన విజేత జిసిఏ టీం, రన్నర్ అప్ హరీష్-11 టీం జట్లకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు బహుమతులు అందజేస్తూ క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో శారీరక దృఢత్వం, పట్టుదల, జట్టు స్పూర్తి వంటి విలువలను పెంపొందిస్తాయని అన్నారు.
యువత దేశ భవిష్యత్తు అని, వారు చదువుతో పాటు క్రీడలలోనూ ప్రతిభ చూపి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అదే విధంగా యువత సామాజిక సేవ, ప్రజాసేవ రంగాల్లో ముందుకు రావాలని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ యువతకు ప్రోత్సాహంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్, ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మహాదేవపూర్ సింగిల్ విండో సొసైటీ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షురాలు కుంభం స్వప్న, గద్దె సమ్మిరెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు ఒన్న వంశవర్ధన్ రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాడీ మహేశ్వరి, మంథని నియోజక వర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, మండల యూత్ అధ్యక్షులు చిటూరి మహేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.