జయశంకర్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం: ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, ఆగస్టు 6 (విజయ క్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్(Professor Kothapalli Jayashankar) సార్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఆయన విగ్రహానికి గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ జయశంకర్ సార్ చూపిన మార్గం, ఆయన ఆశయాలు నేటికీ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణం, సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. జయశంకర్ సార్ కలలుగన్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి, విద్యాాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






