20-09-2025 01:03:27 AM
-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శ
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): సింగరేణి కార్మికులకు 35 శాతం లాభాల వాటా ప్రకటించాలని - తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ర్ట అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులోని సింగరేణి భవన్ను ముట్టడించా రు. ఈ కార్యక్రమానికి కొప్పుల ఈశ్వర్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు.
2023 లాభాల్లో 33 శాతం ఇవ్వకుండా కేవలం 16 శాతం మాత్రమే ఇచ్చి అభివృద్ధి పేరుతో రూ.2289 కోట్లు పక్కన పెట్టారని, ఇప్పటి వరకు వాటి ఖర్చు వివరాలు తెలియజేయలేదన్నారు. ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కు లాభాలు వచ్చాయని, వాటి నుంచి 35 శాతం కార్మికులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. దీన్ని కార్మిక సంఘం చూస్తూ ఊరుకోదని, కార్మిక వర్గాన్ని ఏకం చేసి మొత్తం బొగ్గు ఉత్పత్తిని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కాపు కృష్ణ, సురేందర్ రెడ్డి, రవి, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.