మమ్మల్ని గెలిపిస్తేనే రూ.400 కోట్ల ప్రాజెక్టు పూర్తి
- చిత్రపురి కాలనీ మాజీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్
- బుధవారంతో ముగిసిన పాలకవర్గం గడువు
- అభివృద్ధిని చూసి ఓటేయాలని విజ్ఞప్తి
మణికొండ, డిసెంబర్ 10 (విజయక్రాంతి) : చిత్రపురి కాలనీలో నిలిచిపోయిన 400 కోట్ల రూపాయల ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా, మిగిలిన అప్పులు తీర్చాలన్నా రాబోయే ఎన్నికల్లో తమ ప్యానల్ను గెలిపించాలని కాలనీ మాజీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కోరారు. బుధవారంతో చిత్రపురి పాలకవర్గం గడువు ముగిసిన నేపథ్యంలో కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఐదేళ్ల క్రితం ఎన్నో ఒడిదుడుకుల మధ్య బాధ్యతలు స్వీకరించిన తమ కమిటీ... కాలనీని అభివృద్ధి పథంలో నడిపించిందని తెలిపారు. తమ పాలకవర్గం గడువు బుధవారంతో ముగిసిందని, ఈ ఐదేళ్లలో కాలనీలో నీటి సమస్య లేకుండా చేశామని వివరించారు. బ్యాంకు అప్పు తీర్చడం కోసమే కార్పొరేట్ నిబంధనల ప్రకారం చెదాలవాడ వద్ద అప్పు తీసుకున్నామని, ఆ మొత్తంతో బ్యాంకు రుణం క్లియర్ చేశామని స్పష్టం చేశారు.
ఇప్పుడు చెదాలవాడ అప్పు తీర్చాలంటే 400 కోట్ల ప్రాజెక్టు పూర్తి చేయడం అత్యవసరమని, తమను గెలిపిస్తేనే అది సాధ్యపడుతుందని వెల్లడించారు. తాము ఏ తప్పు చేయలేదని, ఒకవేళ తప్పులు జరిగాయని భావిస్తే ఆధారాలతో సహా నిరూపిం చాలని సవాల్ విసిరారు.కాలనీలోని 4500 కుటుంబాలకు తాము అండగా నిలిచామని, డూప్లెక్స్, రో హౌస్ల నిర్మాణ పనులు వ్యయం పెరిగినా పూర్తి చేశామని అనిల్ గుర్తు చేశారు.
2023లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినప్పటికీ, నిధులు సమకూర్చుకుని పనులు ఆగకుండా చూసామన్నారు. ఈ సమావేశంలో సెక్రెటరీ పిఎస్ఎన్ దొర, కమిటీ సభ్యులు టి.లలిత, కొంగర రామకృష్ణ ప్రసాద్, అలహరి, బత్తుల రఘు, వేణుగోపాలరావు, డి.రమేష్ బాబు, నిమ్మగడ్డ అనిత తదితరులు పాల్గొన్నారు.






