19-08-2025 10:37:43 PM
పోలీస్ కమిషనర్ బి.అనురాధ
సిద్దిపేట క్రైమ్: షీటీమ్, 'భరోసా' సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ బి.అనురాధ సూచించారు. మహిళలు, పిల్లలు రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై మంగళవారం స్థానిక భరోసా కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ షీ టీం, భరోసా సిబ్బందికి పలు సూచనలు చేశారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. రోజుకు మూడు, నాలుగు సార్లు హాట్ స్పాట్స్ లను సందర్శించాలని, నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. సాయం కోరి వచ్చే మహిళలు, పిల్లల పట్ల గోప్యత పాటించాలని సూచించారు.
ఏసీపీలు వారానికోసారి షీ టీమ్ కార్యక్రమాలపై మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లినప్పుడు ఉపాధ్యాయులు, అధ్యాపకుల ప్రవర్తన తీరును పిల్లలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. భరోసా కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యాచార కేసుల్లో బాధితులకు కాంపెన్సేషన్ ఇప్పించడానికి వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది కృషి చేయాలని చెప్పారు. కాంపెన్సేషన్ రాని కేసులను లిస్ట్ ఔట్ చేయాలని మహిళా ఇన్స్పెక్టర్ దుర్గకు సూచించారు.