23-01-2026 12:00:00 AM
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, జనవరి 22 (విజయక్రాంతి): ప్రజలకు సత్వర న్యాయం అందేలా అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తహశీల్దార్లు, ఎంపిడివోలతో రెవెన్యూ సమస్యలు, గ్రామా ల పారిశుద్ధ్యంపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ అధికారులు ప్రజల దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచుల శిక్షణా కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలను చేపట్టాలన్నారు.
ఉదయాన్నే అధికారులు క్షేత్ర సందర్శనలు చేయాలన్నారు. గ్రామాల్లో వీధి దీపాల మరమ్మత్తులు చేపట్టాలన్నారు. గ్రామాలకు కేటాయించిన నిధులు 30 శాతం పారిశుద్ధ్యానికి, 30 శాతం త్రాగునీటి సరఫరాకు కేటాయించాలన్నారు. అన్ని గ్రామాల్లోని ట్రాక్టర్లు పనిచేయు విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాస రావు, జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపిడివోలు, అధికారులు పాల్గొన్నారు.