09-09-2025 02:59:44 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) నిర్వాహకులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందజేస్తున్న మెనూ ను పరిశీలించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధనపై ఆరా తీశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో ప్రావీణ్యం గల ఉపాధ్యాయులచే విద్యా బోధన అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పాఠశాలకు రాని కారణాలను తెలుసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ బాబు, ప్రధాన ఉపాధ్యాయుడు తంగళ్ళపల్లి రమేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.