09-09-2025 08:13:20 PM
డిప్యూటీ డి ఎం & హెచ్ ఓ డాక్టర్ చందులాల్..
చేనేత కార్మికుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు..
హుజురాబాద్ (విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను అరి కట్టవచ్చని హుజురాబాద్ డిప్యూటీ డిఎం&హెచ్వో డాక్టర్ చందులాల్(Deputy DMHO Dr. Chandulal) అన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ ఆదేశాల మేరకు వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వరుణ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట పట్టణంలోని షత్రంజి చేనేత సంఘంలో గల చేనేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఎన్ సి డి క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు, సంఘంలోని 115 మంది చేనేత కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మందులు అందించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ చందు శిబిరాన్ని సందర్శించారు. డ్రై డే కార్యక్రమంపై కార్మికులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు. ప్రభుత్వం అందించే బిపి షుగర్ మందులనే వాడాలని తద్వారా ఆర్థికంగా భారం తగ్గించుకోవచ్చని ప్రభుత్వ మందులు సమర్థవంతంగా పనిచేస్తాయని అన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రతి మంగళ, శుక్రవారలలో ఆరోగ్య ఉప కేంద్రాలలో జరుగుతుందని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మహోన్నత పటేల్, హెల్త్ ఎడ్యుకేటర్స్ మోహన్ రెడ్డి,పంజాల ప్రతాప్ గౌడ్ షత్రంజి చేనేత సంఘం అధ్యక్షుడు ఉడుత రమేష్, సూపర్వైజర్ అరుణ,ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.